రైతన్నల కోసమే గాంధీజీ తొలి సత్యాగ్రహం
పోరాటమంటే విధ్వంసం, తిరుగుబాటంటే సాయుధ సంఘర్షణే అనుకునే ప్రపంచానికి సత్యాగ్రహ ఆయుధం ఇచ్చింది ‘చంపారన్’. దేశానికి వెన్నెముకైన రైతుని స్వాతంత్య్రోద్యమానికీ వెన్నుదన్నుగా నిలిపిన పోరాటమిది. పట్టణాల్లో టెంటేసిన స్వాతంత్య్ర ఉద్యమాన్ని పల్లెకు నడిపించిన పోరాట స్ఫూర్తి చంపారన్. మొదటి సత్యాగ్రహ పోరాటంలో విజయం సాధించి, భవిష్యత్ రాజకీయాలకు ఇక్కడ నుంచే బాటలేసుకున్నారు గాంధీజీ.
బీహార్లోని చంపారన్ జిల్లాలో పంట సాగుపై ఎస్టేట్లదే నిర్ణయం. నీలిమందు తోటలు సాగు జేసే రైతులను తెల్ల యజమానులు పన్నుల పేరుతో పీక్కుతినేవారు. భూమి పన్నునుంచి పెళ్లి పన్ను దాకా.. ఓ యాభైరకాల పన్నులు వేసేవాళ్లు.
ఈ పన్నుల భారమే కాకుండా ‘తీస్ కరియా’ పద్ధతి మరో గుదిబండలా మారింది. ఈ పద్ధతి ప్రకారం సాగు భూమిలో నాలుగింట మూడు వంతుల భూమిలో నీలిమందు పంటను సాగు చేయాలని షరతు విధించారు. ధరలేకున్నా పండించాలి. లాభాలు రాకున్నా పన్నులు కట్టాలి.
నేరం చేశానని గాంధీజీ వాంగ్మూలం
రసాయనిక పద్ధతుల్లో నీలిమందు తయారీని మొదలుపెట్టారు. దీంతో నీలిమందు ధర పడిపోయింది. పండించిన రైతులు నష్టాల పాలయ్యారు. అయినా తీస్ కరియా షరతుల వల్ల మళ్లీ నల్లమందు తోటలు వేయడం, పన్నులు చెల్లించడం తప్పలేదు. ఆ రైతులకు సాయం చేసేందుకు గాంధీజీ 1917 ఏప్రిల్లో మోతిహారీకి వెళ్లారు. ఆ సందర్భంగా అధికారులు నిషేధాజ్ఞలు జారీ చేశారు. వాటిని గాంధీ ధిక్కరించినందుకు అరెస్ట్ చేశారు. ‘తాను నేరం చేసిన మాట నిజమే’నంటూ కోర్టులో గాంధీ సుదీర్ఘమైన వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం ఆ కేసుని ఉపసంహరించుకున్నది. తెల్ల యజమానుల దాష్టీకాలకు బక్కరైతుల కష్టాలను సత్యాగ్రహ ఉద్యమంతో సమైక్యపరిచారు బాపూజీ.
గాంధీ చెప్పిన గొప్ప మాట
ముజఫర్ ఉల్హక్, కిశోర్ ప్రసాద్, బాబూ రాజేంద్రప్రసాద్, ఆచార్య కృపలానీ, మహదేవ దేశాయ్ సహాయంతో 20 వేల మంది రైతుల నుంచి మహాత్మాగాంధీ వినతులు సేకరించారు. వాటన్నింటినీ ప్రభుత్వానికి అందజేశారు. అప్పుడు ప్రభుత్వమొక విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ సూచనలతో చట్టాలు రూపొందించారు. ఫలితంగా కౌలురేట్లు తగ్గాయి. అంతకుముందు అక్రమంగా వసూలు చేసిన పన్నులను యూరోపియన్ ఎస్టేట్స్ యజమానులు రైతులకు తిరిగి ఇచ్చారు. నీలిమందుని నిర్బంధంగా పండించాలనే తీస్ కరియా పద్ధతి రద్ధయింది. ‘ఈ పోరాటంలో నా కృషి చాలా తక్కువ. ఐక్యంగా ఉండి సత్యాగ్రహం చేసిన రైతుల వల్లే ఈ వి జయం సిద్ధించింది’ అని గాంధీజీ అన్నారు. ఇలా చంపారన్లో రైతుల ఐక్యత బ్రిటిషర్ల ఆధికత్యను తొలిసారి సవాల్ చేసింది.