హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎంఎస్ స్వామినాథన్ ఆధునిక వ్యవసాయ మార్గదర్శకుడని, దేశానికే కాకుండా ప్రపంచ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సాగు రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని, చేపట్టిన కార్యక్రమాలను స్వామినాథన్ ప్రశంసించిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్వామినాథన్ మృతి యావత్ దేశ సాగు రంగానికి తీరని లోటని మంత్రి హరీశ్రావు చెప్పారు. స్వామినాథన్ అన్నదాతల ఆత్మబంధువని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ కీర్తించారు.
స్వామినాథన్ను రైతులోకం ఎన్నటికీ మరువదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఆయన మృతి వ్యవసాయ రంగానికి కలిగిన లోటు పూడ్చలేదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. యావత్ దేశానికి తన పరిశోధనలతో ఎంతో సేవ చేశారని మంత్రి గంగుల కొనియాడారు.
పంటల సమృద్ధి, ఆహార అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఆయన మృతిపై రాష్ట్ర వ్యవసాయరంగ సలహదారు చెన్నమనేని రమేశ్బాబు సంతాపం తెలిపారు. దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఎంతో కృషి చేశారని స్వామినాథన్ అవార్డు గ్రహీత, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు అన్నారు.