కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలపై అత్యున్నత చట్టసభల్లో నిరసన తెలపడాన్ని కూడా మోదీ సర్కారు సహించలేకపోతున్నది.పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలే ఉండకూడదు అన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తున్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుక లేకుండా చేస్తున్నది.
మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. మునుపెన్నడూ లేని విధంగా పాలు, పెరుగు, చక్కెర, ఉప్పు వంటి వాటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవడంపై చర్చించాలని అడిగినందుకు సస్పెండ్ చేశారు.
-బడుగుల లింగయ్య యాదవ్
పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డేగా మిగిలిపోతుంది. అధిక ధరలు, జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై సభలో చర్చకు పట్టుబడితే సభ్యులను సస్పెండ్ చేస్తారా?
-కేఆర్ సురేశ్రెడ్డి
సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే మమ్మల్ని సస్పెండ్ చేశారు. కేంద్ర అప్రజాస్వామిక
విధానాలపై తెలంగాణ ప్రజా కోర్టులో తేలుస్తాం.
-వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): జీఎస్టీ, అధిక ధరలు, ద్రవ్యోల్బణంపై రాజ్యసభలో నిరసనలు తెలిపిన 19 మంది విపక్ష సభ్యులను డిప్యూటీ చైర్మన్ వారం రోజులపాటు సస్పెండ్ చేశారు. వీరిలో టీఆర్ఎస్కు చెందిన బడుగుల లింగయ్య యాదవ్, దీవకొండ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర కూడా ఉన్నారు. వీరితోపాటు 16 మంది విపక్ష ఎంపీలు కూడా సస్పెండ్ అయ్యారు. సోమవారం లోక్సభలో కాంగ్రెస్ సభ్యులపై వేటువేసిన ప్రభుత్వం.. మంగళవారం రాజ్యసభలో విపక్షాల గొంతు నొక్కింది. అధిక ధరలపై చర్చించాలని కోరినందుకు తమపై సస్పెన్షన్ వేటు వేశారని విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి.
పేదలపై కేంద్రం మోపుతున్న ధరలు, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధింపును వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు మంగళవారం రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విపక్షాలు పట్టు వీడకపోవడంతో అసహనానికి గురైన డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్.. సభ్యుల సస్పెన్షన్కు సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టాలని అధికారపార్టీని కోరారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి మురళీధరన్.. 10 మంది రాజ్యసభ సభ్యులను వారంపాటు సస్పెండ్ చేయాలంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదిస్తున్న సమయంలో డిప్యూటీ చైర్మన్ 19 మంది ఎంపీల పేర్లు చదివారు. వీరిలో టీఆర్ఎస్ ఎంపీలు ముగ్గురు, ఏడుగురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, ఆరుగురు డీఎంకే ఎంపీలు, ఇద్దరు సీపీఎం ఎంపీలు, ఒక సీపీఐ ఎంపీ ఉన్నారు.
ఎంపీలను సస్పెండ్ చేసిన అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి సమావేశమైన సభలో ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. పలు సమస్యలపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో 15 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. తర్వాత 12.20కి సభ తిరిగి సమావేశమైంది. అయినా నిరసనలు ఆగలేదు. చివరకు నిరసనల నడుమనే ప్రశ్నోత్తరాలు నిర్వహించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా 19 మంది విపక్ష సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా గర్హిస్తున్నట్టు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ధ్వజమెత్తారు. మోదీ హయాంలో దేశంలో అన్ని రంగాలూ నాశనమయ్యాయన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు అందరి బతుకులను నాశనం చేయడమే మోదీ సర్కారు పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. పాలు, పెరుగు, చక్కెర, ఉప్పు వంటి మునుపెన్నడూ లేని వాటిని కూడా జీఎస్టీ పరిధిలోకి తేవడంపై చర్చించాలని అడిగినందుకు సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు ప్రజల తరఫున సభలో గళం వినిపించామన్నారు. తెలంగాణలో గత పది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుంటే.. సీఎం కేసీఆర్ బాధితుల దగ్గరకు వెళ్లి భరోసా కల్పించారని.. కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి సహాయం అందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజ్యసభ నుంచి 5 పార్టీల సభ్యులను సస్పెండ్ చేయడాన్ని టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డేగా మిగిలిపోతుందని అన్నారు. అధిక ధరలు ఒకవైపు, జీఎస్టీ విధింపు, ద్రవ్యోల్బణ్యంపై సభలో చర్చకు పట్టుబడితే సభ్యులను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. వీటిపై ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు ఏర్పాటుచేయడం లేదని నిలదీశారు. ప్రజలకు ముఖ్యమైన విషయంపై చర్చకు డిమాండ్ చేయడం తప్పా? అని ప్రశ్నించారు. తెలంగాణలో వర్షాలు, వరదల వల్ల జరిగిన భారీగా జరిగిన నష్టంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేస్తే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే తమను సభ నుంచి తమను సస్పెండ్ చేశారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కేంద్రం విధానాలపై పోరాడుతున్న తమపై వేటు వేయడాన్ని దుయ్యబట్టారు. కేంద్రం అప్రజాస్వామిక విధానాలపై తెలంగాణ ప్రజా కోర్టులో తేలుస్తామని రవిచంద్ర హెచ్చరించారు.