సిటీబ్యూరో, జూన్ 1(నమస్తే తెలంగాణ): ఓ ప్రేమికుడు.. స్విట్జర్లాండ్లో ఉన్న ప్రియురాలి కోసం బయలుదేరి.. నాలుగేండ్ల తర్వాత తిరిగి సోమవారం భారత దేశానికి తిరిగొచ్చాడు. తన ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇష్టపడిన అమ్మాయి కోసం డబ్బులు లేకుండా ఏకంగా ఏప్రిల్ 2017న తన 61 రోజుల యాత్రను ప్రారంభించాడు. ఇలా .. రెండు దేశాల సరిహద్దును దాటి వెళ్లే క్రమంలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు దొరికిపోయాడు. అలా పాకిస్తాన్లో మూడేండ్లు బందీగా, ఓ ఏడాది సరిహద్దు దాటినందుకు అక్కడి చట్టాల ప్రకారం జైలు జీవితాన్ని గడిపి సోమవారం భారత దేశానికి తిరిగొచ్చి.. మంగళవారం సైబరాబాద్ పోలీసుల ద్వారా వారి కుటుంబం చెంతకు చేరాడు. తాను క్షేమంగా తిరిగి రావడానికి తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ సీపీ సజ్జనార్తో పాటు కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ, హోంశాఖలు చాలా కృషి చేశాయని వారందరికీ కృతజ్ఞతలను తెలిపాడు.
మంగళవారం గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకా రం…ఏపీ విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ప్రశాంత్, శ్రీకాంత్ సోదరులు.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్లోని కూకట్పల్లిలో నివాసం ఉన్నారు. ప్రశాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాద్, బెంగళూరులో పని చేశా డు. 2017, ఏప్రిల్లో ప్రశాంత్.. తాను ప్రేమించిన యువతి స్విట్జర్లాండ్లో ఉండగా ఆమె కోసం.. ఆఫీస్కని ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మాదాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఇంట్లో నుంచి వెళ్లిన ప్రశాం త్ రైలులో రాజస్థాన్ బికనర్కు వెళ్లాడు. అక్కడి నుంచి తార్ ఏడారి ప్రాంతం నుంచి పాక్ సరిహద్దుకు వెళ్లాడు. అక్కడి నుంచి పాకిస్తాన్లోకి అడుగుపెట్టి.. దాదాపు 40 కిలోమీటర్లపై లోపలికి వెళ్లి.. పాక్ ఆర్మీ అధికారులకు చిక్కాడు. నాలుగేండ్ల పాటు జైలులో ఉన్నాడు.
చివరకు తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు ఈ మిస్సింగ్ కేసును ఏలాగైనా ఛేదించాలనే లక్ష్యంతో 2019లో వెలువడిన ఓ వీడియోతో ప్రశాంత్ పాక్లో ఉన్నట్లు గుర్తించి.. అతన్ని తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు కేంద్ర ప్రభుత్వం, హోంశాఖ, విదేశాంగ శాఖ అధికారుల కృషితో పాక్ ఆర్మీ అధికారులు సోమవారం అతన్ని పంజాబ్ అటారీ సరిహద్దులో భారత, సైబరాబాద్ పోలీసులకు అప్పగించారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకువచ్చిన సైబరాబాద్ పోలీసులు మంగళవారం సాయంత్రం అతని సోదరుడు శ్రీకాంత్కు అప్పగించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్ పీఎస్లో నమోదైన ప్రశాంత్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడిపోయింది.