హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ‘ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ వెనుకబడింది. ఇక్కడి సర్వే నివేదికలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించటం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉండీ ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? అసెంబ్లీ ఎన్నికల జోష్ తగ్గడానికి కారణమేమిటి? ఎంతో కీలకమైన ఈ ఎన్నికల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం? ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు సీరియస్గా తీసుకోవటం లేదు? ఒకరిద్దరు తప్ప ఇతర మంత్రులు మొక్కుబడి ప్రచారానికి పరిమితం అయినట్టు మాకు సమాచారం ఉన్నది’ అని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీవర్గాల సమాచారం. రాష్ట్రంలో తాజా ఎన్నికల పరిస్థితిపై కేసీ వేణుగోపాల్ మంగళవారం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అభ్యర్థులు, ఎమ్మెల్యేలతో అత్యవసరంగా జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది.
మూడు వారాల క్రితం కూడా కేసీ వేణుగోపాల్ ఆకస్మికంగా హైదరాబాద్కు వచ్చి పీసీసీ ముఖ్యనేతలు, మంత్రులు, అభ్యర్థులు, రాష్ట్ర ఇన్చార్జిలను అప్రమత్తం చేశారు. అధిష్ఠానం ఆశించిన మేరకు రాష్ట్రంలో విజయావకాశాలు ఆశాజనకంగా లేవని అప్పుడే హెచ్చరించి వెళ్లారు. గతానికి, ప్రస్తుత పరిస్థితికి పెద్దగా తేడా ఏమీ కనిపించటం లేదని రాష్ట్ర ముఖ్య నేతలపై మండిపడినట్టు సమాచారం. ‘పరిస్థితి మించిపోలేదు. ఇంకా నాలుగు రోజుల వ్యవధి ఉన్నది. ఈ సమయం ఎంతో కీలకం. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎక్కడికక్కడ కష్టపడి పనిచేస్తే తప్ప పార్టీకి గౌరవప్రదమైన ఎంపీ సీట్లు దక్కటం కష్టమే’ అని హెచ్చరించినట్టు తెలిసింది.
సమీక్షలో భాగంగా మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలపై కేసి వేణుగోపాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. జూమ్ మీటింగ్కు రాజనరసింహ గైర్హాజరు కావటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో ఉండటం వల్ల హాజరుకాలేకపోయారని రాష్ట్ర నాయకులు వేణుగోపాల్కు చెప్పేందుకు ప్రయత్నించగా, తమకు తెలియదా? ఎవరు ఎంత పనిచేస్తున్నారో? అని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగతావారు మొక్కుబడిగా ప్రచారానికి పరిమితం అయ్యారని మండిపడినట్టు సమాచారం.
సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ ఇన్చార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కేసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాదాపు గంటకుపైగా సాగిన జూమ్ మీటింగ్లో పార్టీ నేతలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. జూమ్ మీటింగ్కు గైర్హాజరైన నాయకులు, ఎమ్మెల్యేలపై అధిష్ఠానానికి నివేదిక ఇవ్వాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను కేసీ ఆదేశించినట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగానే భవిష్యత్తులో పదవులు ఉంటాయని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం.