హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ కొనసాగుతున్నది. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలలేదు. ఏ ఒక్క అభ్యర్థి కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవటంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి వచ్చింది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఏవీఎన్ రెడ్డి, గుర్రం చెన్నకేశవరెడ్డిపై 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 13న పోలింగ్ జరిగింది. 9 జిల్లాల పరిధిలో 29,720 ఓట్లు ఉండగా 90.40 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించున్నారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కౌంటింగ్ను చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచి అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. 21 మంది ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. అటు.. కౌంటింగ్ కేంద్రం వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపునకు సుమా రు 10 గంటలు పట్టింది. ఇందులో ఏవీఎన్ రెడ్డికి 7,505 ఓట్లు, చెన్నకేవశరెడ్డికి 6,584 ఓట్లు, మాణిక్ రెడ్డికి 4,569 ఓట్లు, హర్షవర్ధన్ రెడ్డికి 1,907 ఓట్లు, కాటేపల్లి జనార్దన్ రెడ్డికి 1,236 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 452 చెల్లని ఓట్లు ఉండటం గమనార్హం. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 921 ఓట్ల మెజార్టీ వచ్చింది. అభ్యర్థి గెలుపునకు మ్యాజిక్ ఫిగర్ 12,709 ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే ఏ అభ్యర్థికీ 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును సాయంత్రం 5 గంటలకు మొదలు పెట్టారు. ఇందులో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్ చేయనున్నారు. రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. రెండో ప్రాధాన్య ఓట్లలోనూ ఫలితం తేలకపోతే మూడో ప్రాధాన్య ఓట్ల లెక్కింపును చేపడతామని, తుది ఫలితం శుక్రవారం తెల్లవారుజామున వెల్లడయ్యే అవకాశం ఉన్నదని రిటర్నింగ్ అధికారి ప్రియాంక తెలిపారు.