తుంగతుర్తి, ఫిబ్రవరి 7 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ చేతగాని తనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాలపై కేంద్రం పెత్తనంతో ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు జిల్లాల్లో సాగు, తాగునీటి కోసం కేంద్రం అనుమతి కోసం ఎదురుచూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం కృష్ణా జలాలపై మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతున్నదని తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అధ్యక్షతన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాల కృష్ణా జలాల ట్రిబ్యునల్ వివాదం ప్రధాని మోదీ తీర్చడానికి 9 ఏండ్లకుపైగా పట్టిందని అన్నారు. నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా జలాల సమస్యను ఆంధ్రా-తెలంగాణ రాష్ర్టాలు తీర్చుకుంటాయని, కేంద్రం తలదూర్చవద్దని కరాఖండిగా చెప్పి పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు తేటతెల్లం అయ్యిందని విమర్శిం చారు. సాగునీటి విషయంలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించకపోవడం జిల్లా ప్రజలకు అన్యాయం చేసినట్లేనని చెప్పారు. సమావేశంలో జడ్పీ చైర్మన్లు గుజ్జ దీపికాయుగంధర్రావు, ఎలిమినేటి సందీప్రెడ్డి, రాజకీయ విశ్లేషకుడు ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రజాక్ తదితరులు పాల్గొన్నారు.