సూర్యాపేట, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : సాధారణ ప్రసవాల్లో సూర్యాపేట జనరల్ దవాఖాన రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తొలి కాన్పులో 90 శాతం, మలి కాన్పులో 60 నుంచి 80 శాతం సాధారణ ప్రసవాలు జరిగాయి. తొలి కాన్పును ప్రైవేట్లో సర్జరీ ద్వారా ప్రసవం చేసిన వారికి సైతం మలి కాన్పును జనరల్ దవాఖానలో సాధారణ ప్రసవాలు చేయడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి నెలనెలా సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. జనవరిలో 50 శాతం, జూన్లో 87, జూలైలో 90, ఆగస్టులో 83 శాతం నార్మల్ డెలివరీలు నమోదయ్యాయి. గైనకాలజీ డిపార్ట్మెంట్ ఇన్చార్జి డాక్టర్ సుజాతతోపాటు ప్రతి డాక్టర్, నర్సులు అందరి సహకారంతోనే సాధారణ ప్రసవాల్లో సూర్యాపేట దవాఖాన టాప్లో నిలిచిందని జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ దండ మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొన్నేండ్లుగా వైద్యం వ్యాపారంలా మారి సాధారణ ప్రసవాలు పోయి దవాఖానల్లో 90 శాతానికి పైగా ఆపరేషన్లు చేశారు. సీఎం కేసీఆర్ చొరవతో గత మూడేండ్లుగా క్రమంగా సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. దవాఖానలను ఆధునికీకరించడం, మెడికల్ కళాశాలల ఏర్పాటు, డాక్టర్లు, సిబ్బంది నియామకాలతో పాటు కేసీఆర్ కిట్లు వంటి అనేక కార్యక్రమాలతో ప్రభుత్వ దవాఖానలకు వెళ్తున్న వారిసంఖ్య పెరుగుతున్నది.
రెండో కాన్పులోనూ సాధారణమే
సాధారణ ప్రసవాలను అత్యధికంగా చేస్తూ సూర్యాపేట దవాఖాన రాష్ట్రంలోనే టాప్లో నిలిచింది. దీంతోపాటు రెండో కాన్పులోనూ సాధారణ ప్రసవాలు చేస్తూ ప్రత్యేకత చాటుకొన్నది. ఈ ఏడాది జూన్లో దవాఖానలో 465 ప్రసవాలవ్వగా, వీటిలో 168 (68 శాతం) మందికి రెండో కాన్పులోనూ సాధారణ ప్రసవాలు చేశారు. 297 మంది తొలి కాన్పు కోసం వస్తే 41 మందికి మాత్రమే ఆపరేషన్లు చేశారు. సాధారణ కాన్పులు 77 శాతంగా నమోదైంది. జూలైలో 145 మంది రెండో కాన్పు కోసం రాగా 63 శాతం సాధారణ ప్రసవాలు అయ్యాయి. అలాగే 240 మంది తొలి కాన్పు కోసం రాగా 90 శాతం సాధారణ ప్రసవాలు నమోదయ్యాయి.
అందరి సహకారంతోనే..
దవాఖానలోని గైనకాలజీ డాక్టర్లు, నర్సులతోపాటు అందరి సహకారంతోనే సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. ఆపరేషన్ అవసరం లేకుండా ప్రసవానికి వచ్చిన మహిళలకు గైనకాలజీ హెచ్ఓడీ డాక్టర్ సుజాత నేతృత్వంలోని డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులు సాధారణ ప్రసవాలకు చేయాల్సిన వ్యాయామాలపై సూచిస్తున్నారు.
–డాక్టర్ దండ మురళీధర్రెడ్డి, సూపరింటెండెంట్, సూర్యాపేట జనరల్ దవాఖాన
మళ్లీ ఆపరేషనే అనుకున్న..
ఐదేండ్ల కింద నాకు పాప పుట్టింది. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పెద్దాపరేషన్ అయ్యింది. రెండో కాన్పుకు కూడా పెద్దాపరేషనే చేస్తరనుకున్న. మా వాళ్లు సూర్యాపేట గవర్నమెంట్ దవాఖానలో చేర్పించిండ్రు. సాధారణ ప్రసవంలో నాకు బాబు పుట్టిండు. మావాళ్లందరూ ఆశ్చర్యపోయిండ్రు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి సారు చలువతో సూర్యాపేట గవర్నమెంట్ దవాఖాన మంచిగా మారింది.
–రాసమళ్ల రమ, గోరెంట్ల, సూర్యాపేట జిల్లా