Suryapet | సూర్యాపేట, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రగతి పరుగులు పెడుతుండగా.. ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. జిల్లా ఏర్పాటు నాటి నుంచి రూ.18 వేల కోట్లకు పైగా అభివృద్ధికి, సుమారు రూ.16 వేల కోట్లను సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలే కాకుండా అనేక ప్రజా సమస్యలను వేల కోట్లు వెచ్చించి పరిష్కరిస్తుండటాన్ని ప్రతిపక్షాలు సైతం అంగీకరిస్తున్నాయి. విద్య, వైద్యం, తాగు, సాగునీటితోపాటు వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, మినీ ట్యాంక్బండ్లు, చెరువుల ఆధునీకరణ, అన్ని గ్రామాలు, పట్టణాలకు రహదారులు సమకూరాయి.
ఎటుచూసినా సస్యశ్యామలం
2014కు ముందు జిల్లాలో సరైన రహదారులు లేవు.. పలు ప్రాంతాల్లో తాగేందుకు చుక్క నీరు కూడా దొరకకపోయేది. రోజుకు ఐదారు గంటలు సరఫరా అయ్యే విద్యుత్తు కోసం రైతులు ఎదురు చూస్తూనే సబ్స్టేషన్ల వద్ద ధర్నాలు చేసేవారు. సాగునీటికి దిక్కే లేదు. ఎరువులు, విత్తనాలు సరిపడా దొరకకపోయేది. గ్రామాల్లో వీధుల్లో మురుగునీరు, మచ్చుకైనా కనిపించని పచ్చదనం.. ఇలా బోలెడు సమస్యలు. నాటి రోజులను గుర్తు చేసుకుంటే ఓ పీడకలే అంటున్నారు జిల్లా జనం. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొమ్మిదిన్నరేండ్లలో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎటుచూసినా అభివృద్ధి కండ్ల ఎదుట సాక్షాత్కరిస్తున్నది.
గతంలో ఊర్లకు వెళ్తే గ్రామ గుమ్మాల్లో రాజకీయ పార్టీల హత్యాకాండలకు జ్ఞాపకాలుగా స్థూపాలు కనిపించేవి. కానీ ఇప్పుడు స్వచ్ఛమైన సాగునీటిని అందించేందుకు రూ.1,277 కోట్లతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. గ్రామాల నుంచి మండల కేంద్రాలు, అక్కడి నుం చి జిల్లా కేంద్రాలకు రోడ్లతోపాటు గ్రామాలు, పట్టణాల్లో అంతర్గత రోడ్లకు రూ.2,575 కోట్లు వెచ్చించడంతో గుంతల రోడ్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి వేసిన రోడ్లకు వంద రెట్ల రహదారులు గత ఆరేండ్ల కాలంలో పూర్తయ్యాయి.
మూసీ డ్యామ్ ఆధునీకరణ, కాల్వల మరమ్మతులకు రూ.80కోట్లు వెచ్చించగా.. మూసీ, పాలేరు వాగులపై రూ.268.62 కోట్లతో చెక్ డ్యామ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. లిఫ్ట్ల మరమ్మతులకు రూ.10.63 కోట్లు, కొత్త లిఫ్ట్లకు సుమారు రూ.1,600 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే చెరువులను సుమారు రూ.412 కోట్లతో అభివృద్ధి చేయడంతో నేడు అవన్నీ జలకళను సంతరించుకున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.450 కోట్లతో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలకు దాదాపు రూ.342 కోట్లు వెచ్చించారు. దళితుల ఆర్థిక స్వావలంబనకు తీసుకొచ్చిన దళితబంధు పథకం ద్వారా జిల్లాలో 2,568 మందికి లబ్ధి చేకూరింది. రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తిరుమలగిరి మండలంలో 2,223 మందిని దళితబంధుకు ఎంపిక చేశారు.
ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు
రూ.1,277 కోట్లతో జిల్లాలో మిషన్ భగీరథ పథకం పూర్తిచేయడంతో నేడు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. నాగార్జునసాగర్ టెయిల్పాండ్ సమీపంలోని చిట్యాల నుంచి సూర్యాపేట మండలం ఇమాంపేట ప్లాంట్కు 95 ఎంఎల్డీల నీటిని పంపింగ్ చేసి అక్కడ జలాలను శుద్ధిచేసి సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు అందిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గంతోపాటు కోదాడ నియోజకవర్గంలోని కొంత భాగానికి పాలేరు నుంచి కృష్ణాజలాలు తరలిస్తున్నారు.
అందరికీ అత్యాధునిక వైద్యం
ఎవరూ ఊహించని మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ వద్ద పట్టుబట్టి మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటకు తీసుకొచ్చారు. రూ.500 కోట్లతో దీని నిర్మాణం పూర్తయింది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే 300 పడకల దవాఖానలో రోగులకు అన్ని హంగులతో అత్యాధునిక వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల వ్యాధులకు ఇక్కడ వైద్య సేవలు అందుతుండగా.. మహిళలకు ఉచితంగానే రొమ్ము క్యాన్సర్ డిటెక్షన్ అండ్ ఆపరేషన్లు చేస్తున్నారు. కొవిడ్ సమయంలో హైదరాబాద్ తరువాత అత్యుత్తమ చికిత్సలు అందడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా కొవిడ్ రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందారు.
కాళేశ్వరంతో పెరిగిన సాగు విస్తీర్ణం
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి తొలి ఫలితం సూర్యాపేటకే దక్కడం ద్వారా జిల్లాలో అనూహ్య రీతిన సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలోని కాల్వలు, తూములు మరమ్మతులకు నోచుకోవడం, మూసీ నదిని రూ.20 కోట్లతో ఆధునీకరించడం, నాగార్జునసాగర్ నీటిని హక్కుగా వాడుకుంటుండటంతో జిల్లాలో సాగు ఊహించని రీతిలో పెరిగింది. జిల్లాలో దాదాపు 6.15 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా.. ప్రస్తుతం 6 లక్షల ఎకరాల వరకు సాగవుతున్నది. గతంలో 1.75 లక్షల ఎకరాలకు మించి వరి సాగు చేసేవారు కాదు.. ప్రస్తుతం 4.17 లక్షల ఎకరాల్లో వరి సాగవుతున్నది. నీళ్లు లేక ధాన్యం పండించలేని రైతాంగానికి గోదాముల అవసరం పడలేదు. కానీ.. కాళేశ్వరం జలాలతో వరి ధాన్యం అమాంతం పెరగడంతో రూ.41 కోట్లతో 14 గోదాములు నిర్మించారు.
ఆటంకం లేకుండా విద్యుత్తు
జిల్లాలో 400 కేవీ సబ్స్టేషన్తోపాటు 220, 132 కేవీ సబ్స్టేషన్ల స్థాపన, వాటి మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు తదితరాల కోసం దాదాపు రూ.3,200 కోట్లకు పైగా వెచ్చించడంతో చిన్న ఆటంకం లేకుండా విద్యుత్తు సరఫరా అవుతున్నది. రైతులకు సాగుకు ముందే రైతుబంధు ఇస్తుండగా సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. దీంతో వ్యవసాయం పండుగలా మారింది. విద్య, వైద్య రంగాలకు కొదవే లేకుండా నిధుల కేటాయింపులు జరుగుతున్నాయి.
జిల్లా ఏర్పాటు అనంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా సూర్యాపేటకు వచ్చిన నిధుల్లో కొన్ని..
మిషన్ భగీరథ : రూ.1,277 కోట్లు
మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ : రూ.65.56 కోట్లు
చెక్ డ్యామ్ల నిర్మాణం : రూ.268.62 కోట్లు
మిషన్ కాకతీయ : రూ.343 కోట్లు
లిఫ్ట్ల మరమ్మతులు : రూ.10.63 కోట్లు
మినీ ట్యాంక్బండ్ల నిర్మాణాలు : రూ.49.24 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ : రూ.18.59 కోట్లు
సూక్ష్మనీటి పారుదల : రూ.16.66 కోట్లు
రైతుబంధు : రూ.2,962.83 కోట్లు
మత్స్య సంక్షేమం : రూ.17.76 కోట్లు
సబ్సిడీ గొర్రెల పంపిణీ : రూ.216.36 కోట్లు
పాడి గేదెల పంపిణీ : రూ.11.84 కోట్లు
కేసీఆర్ కిట్లు : రూ.38.37 కోట్లు
ఆరోగ్య శ్రీ : రూ.118.92 కోట్లు
కల్యాణలక్ష్మి : రూ.289.14 కోట్లు
షాదీ ముబారక్ : రూ.17.55 కోట్లు
డుబుల్ బెడ్రూం ఇండ్లు : రూ.254.83 కోట్లు
మార్కెట్ గిడ్డంగులు : రూ.41 కోట్లు
విద్య, మౌలిక సదుపాయాలు : రూ.88.07 కోట్లు
ఆయా వర్గాల గురుకులాలు : రూ.306 కోట్లు
వైద్యం, మౌలిక సదుపాయాలు : రూ.536 కోట్లు
వడ్డీ లేని రుణాలు : రూ.108.45 కోట్లు
దళితబంధు : రూ.256.80 కోట్లు
ఎస్సీ స్వయం ఉపాధి : రూ.96.18 కోట్లు
ఎస్టీ స్వయం ఉపాధి : రూ.23.86 కోట్లు
బీసీ స్వయం ఉపాధి : రూ.8.30 కోట్లు
మైనారిటీ స్వయం ఉపాధి : రూ.26.07 కోట్లు
సూర్యాపేటలో మెడికల్ కళాశాల : రూ.450 కోట్లు
నర్సింగ్ కళాశాల : రూ.40 కోట్లు
టీయూఎఫ్ఐడీసీ నిధులు : రూ.218 కోట్లు
గ్రామీణ అంతర్గత రోడ్లు : రూ.318.53 కోట్లు
శ్మశాన వాటికల అభివృద్ధి (గ్రామీణ) : రూ.52.66 కోట్లు
వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం : రూ.80.47 కోట్లు
పల్లె ప్రకృతి వనాలు : రూ.65.01 కోట్లు
పట్టణ ప్రకృతి వనాలు : రూ.12 కోట్లు
శ్మశాన వాటికల అభివృద్ధి (పట్టణ) : రూ.19.12 కోట్లు
పట్టణ అంతర్గత రోడ్లు : రూ.145.42 కోట్లు
మున్సిపల్ అభివృద్ధి పనులు (ఎస్టీపీ) : రూ.105.51 కోట్లు
ఆధునిక కూరగాయల మార్కెట్ : రూ.18.40 కోట్లు
ట్రైబల్ సబ్ప్లాన్ రోడ్లు : రూ.51.22 కోట్లు
ఆర్ అండ్ బీ రోడ్లు : రూ.374.65 కోట్లు
జిల్లా కేంద్ర భవన నిర్మాణం : రూ.47.85 కోట్లు
క్రిస్టియన్ భవనం : రూ.2 కోట్లు
మసీద్ అభివృద్ధి, ఖబరస్తాన్ ప్రహరీలు : రూ.5 కోట్లు
ఎస్సీ కమ్యూనిటీ, అంబేద్కర్ భవనం : రూ.28.48 కోట్లు
కుల వృత్తి సంఘాలకు ఆత్మగౌరవ భవనాలు : రూ.16.83 కోట్లు
గ్రామీణ ప్రాంతాలకు సీఎం ప్రత్యేక నిధులు : రూ.143.50 కోట్లు
పట్టణ ప్రాంతాలకు సీఎం నిధులు : రూ.114.18 కోట్లు
డీఎంఎఫ్టీ నిధులు : రూ.216 కోట్లు
సీడీపీ నిధులు : రూ.58.80 కోట్లు
సీఎస్ఆర్ నిధులు : రూ.7.77 కోట్లు
టీఎస్ ప్రైడ్ : రూ.102.74 కోట్లు
దేవాలయాల అభివృద్ధి : రూ.14.77 కోట్లు
24 గంటల విద్యుత్తు, సబ్స్టేషన్లు తదితరాలు : రూ.1,750.97 కోట్లు
400, 220, 132 కేవీ సబ్స్టేషన్లకు : రూ.1,367 కోట్లు