చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమం
బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. త్వరలో పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్లోని బీసీ భవన్లో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ అన్యాయం చేస్తున్నాయని కృష్ణయ్య తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు కనీస ప్రాతినిధ్యం దక్కటంలేదని పేర్కొన్నారు. 16 రాష్ర్టాల్లో కనీసం ఒక్క ఎంపీ కూడా బీసీవర్గాల నుంచి లేరని.. ఇది ప్రజాస్వామ్య, రాజ్యాంగస్ఫూర్తికి తీవ్ర విఘాతమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అట్రాసిటీ చట్టంతో ఎస్టీ, ఎస్టీవర్గాలు ప్రయోజనం పొందుతున్నట్టు.. బీసీలకు అటువంటి పకడ్బందీ పథకాన్ని రూపొందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ, వివిధ ప్రభుత్వ రంగసంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పగిడాల సుధాకర్, పిండపోలు రామ్మూర్తి, పీ చంద్రశేఖర్, చంటి ముదిరాజ్, అనంతయ్య, నిఖిల్, ప్రభాకర్ ప్రజాపతి, 33 జిల్లాల నుంచి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.