హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): వైవాహిక వివాదాల కేసులను కక్షిదారులకు అనువైన కోర్టులకు బదిలీ చేయాలనే పిటిషన్లు ఎకువగా ఉండటంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కేసులను అనుకూలమైన కోర్టుకు బదిలీ చేసుకునే వెసులుబాటు బాధితులకు ఉన్నదని, అయితే హైకోర్టులోనే ఈ తరహా పిటిషన్లు 400 వరకూ ఉన్నాయని పేర్కొన్నది. కేసుల బదిలీపై దిగువ కోర్టులు సుప్రీం మార్గదర్శకాలను పాటించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం ఇటీవల వెలువరించిన తీర్పులో స్పష్టంచేశారు. సిద్దిపేట ఫ్యామిలీ కోర్టులోని దాంపత్య వివాద కేసును ఎల్బీనగర్ కోర్టుకు బదిలీ చేయాలంటూ ఓ వివాహిత దాఖలు చేసిన పిటిషన్పై ఆయన ఈ తీర్పు ఇచ్చారు. సుప్రీం మార్గదర్శకాలను అమలుచేస్తే కేసులను బదిలీ చేయకుండా ఆయా ఫ్యామిలీకోర్టులే విచారించవచ్చని చెప్పారు. ‘హిందూ వివాహ చట్టంలోని 19వ సెక్షన్.. కోర్టు పరిధిని స్పష్టంగా వివరిస్తున్నది. పిటిషన్ ఏ కోర్టులో వేయాలో కూడా అందులో ఉన్నది. బాధితురాలికి రక్షణ లేనప్పుడు కేసును బదిలీ చేయాలని కోరవచ్చు. విచారణకు హాజరయ్యే భార్య, ఆమెకు సహాయకారిగా వచ్చే వ్యక్తికి వసతి, రవాణా ఖర్చులను భర్త చెల్లించాలి. కేసును భార్యాభర్తలు రాజీచేసుకునేప్పుడు లేదా సాక్ష్యం ఇవ్వడానికి మాత్రమే భార్య భౌతికంగా కోర్టుకు హాజరుకావాలి. మిగిలిన సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్ విచారణ నిర్వహించాలని బాధితురాలు కోరవచ్చు. ఇలాంటి దరఖాస్తులపై ఫ్యామిలీ కోర్టులు తగిన నిర్ణయం తీసుకోవాలి’ అని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేరొన్నారు.