Supreme Court | హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయింపులకు పాల్పడే ప్రజాప్రతినిధుల రాజకీయ భవిష్యత్తు ఇకమీదట అంధకారం కానున్నది. ఫిరాయింపుదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనం. మహారాష్ట్రలోని ఎన్సీపీని చీల్చి శివసేన (షిండే)-బీజేపీ ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై ఎన్సీపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై ఫిబ్రవరి 15లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ధర్మాసనం ఆదేశించింది. గత ఏడాది మహారాష్ట్రలోని శివసేన ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు, మణిపూర్ మంత్రి అనర్హత వేటు పిటిషన్పై ఇచ్చిన కీలక ఆదేశాలు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.
గతంలో ఫిరాయింపుదారులకు వ్యతిరేకంగా అందిన ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడంపై రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టుల న్యాయ సమీక్షకు ఆస్కారం ఉండేది కాదు. అయితే, స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గత మే నెలలో తేల్చి చెప్పింది. అలా చేయనిపక్షంలో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టు తలుపులు తట్టేందుకు తాజా తీర్పుతో సుప్రీం వీలుకల్పించింది. దీంతో గోడదూకే వారికి చట్టసభలో ఉన్న సభ్య త్వం కోల్పోవడమే కాదు.. రాజకీయ భవిష్యత్తు కూడా ఉండబోదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పదో షెడ్యూల్లో కీలక అంశాలు
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో 52వ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చా రు. అందులోని పేరాగ్రాఫ్ 1(2)ఏ ప్రకారం.. ఒక పార్టీ ఎన్నికల ప్రణాళికతో ఎన్నికైన ప్రతినిధి ఆ పార్టీ విధివిధానాలకు లోబడి ఉండాలి. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా, పార్టీకి విరుద్ధంగా ఎలాంటి చర్యలకు పాల్పడరాదు. అలా చేస్తే.. సదరు సభ్యుడు స్వచ్ఛందంగా సొంత పార్టీని వీడినట్టే. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని పేరా 1(2) బి ప్రకారం.. ఒక పార్టీ మ్యానిఫెస్టోపై గెలిచిన వ్యక్తి వేరే విధివిధానాలకు చెందిన మరో పార్టీకి అనుకూలంగా చట్టసభల్లో ఓటు వేస్తే.. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం తన సభ్యత్వం కోల్పోతారు. పార్టీ విప్ అంశం స్పీకర్ ద్వారానే అమలు అవుతుంది కాబట్టి విప్ ధిక్కరణకు పాల్పడిందీ లేనిదీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. విప్ను ధిక్కరించినట్లుగా ఫిర్యాదు అందినవెంటనే స్పీకర్ చర్యలు తీసుకోవాలి. పార్టీ నుంచి చీలిపోయిన వర్గానికి గుర్తింపునిచ్చే అంశాన్ని 2004 లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేశారు.
స్పీకర్ ఎప్పుడు తీర్మానం చేసినా..
సుభాశ్ దేశాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు.. పార్టీ విధివిధానాలకు వ్యతిరేకంగా, పార్టీ అనుమతి లేకుండా వేరే పార్టీ వారిని కలిసిన చట్టసభ సభ్యుడు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినదాని కిందే లెక్క. పార్టీ ఫిరాయింపు ఉత్తర్వులు స్పీకర్ తీర్మానం చేసిన తేదీ నుంచి కాకుం డా.. సదరు వ్యక్తి సొంత పార్టీని కాదని వేరే పార్టీ నాయకులను కలిసినప్పటి నుంచే అమల్లోకి వస్తా యి. చట్టసభ్యుడు పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదుపై స్పీకర్ జారీచేసిన నోటీసు సదరు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న సభ్యుడు అందుకున్నాక రెండు వారాల్లోగా స్పీకర్ దానిపై నిర్ణయం తీసుకోవాలి.
నోటీసు జారీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
స్పీకర్ నోటీసు ఎలా జారీ చేయాలనే అంశం కూడా సుప్రీంకోర్టు సుభాశ్ దేశాయ్ కేసులోనే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒక పార్టీ ఎన్నికల గుర్తుపై గెలిచిన చట్టసభ సభ్యుడు వేరే పార్టీ నాయకుడ్ని కలిసినట్టు పత్రికలు, టీవీల్లో వార్తలు ప్రచురణ/ప్రసారం అయితే.. దానినే నోటీసుగా పరిగణించాలి. ఈ ఉత్తర్వుల ప్రకారం పార్టీ ఫిరాయింపుదారుడు తనకు నోటీసు అందలేదని బకాయించే అవకాశాలు లేకుండా సుప్రీంకోర్టు చేసింది.
శివసేన ఎమ్మెల్యేల కేసు ఇది
శివసేన ఎన్నికల మ్యానిఫెస్టోపై గెలిచిన 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది బయటకువచ్చి ఏక్నాథ్ షిండేకు మద్దతు పలికారు. షిండేతో సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్ను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. దానిని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడంతో పాటు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని నోటీసు జారీచేశారు. ఇలా శివసేనలోని ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు పరస్పరం గత జూలైలో దాఖలుచేసిన అనర్హత పిటిషన్లపై నిర్ణ యం తీసుకోవడంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ తీవ్ర జాప్యం చేశారు. ఈ జాప్యాన్ని గత అక్టోబర్ 13న సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలనే ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడానికి వీల్లేదని స్పష్టంచేసింది. నిర్ణీత కాలంలోగా నిర్ణయం తీసుకోవాలి.
అలా చేయకపోతే న్యాయ సమీక్ష చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టులను కోరే హక్కు ఫిర్యాదు చేసే పార్టీకి ఉంటుందని తేల్చిచెప్పిం ది. నిర్ణీత వ్యవధిలో పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ తాము ఇదివరకే ఇచ్చిన ఉత్తర్వులను స్పీకర్ బేఖాతరు చేయడంపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ అడిగే కాలవ్యవధి సంతృప్తిగా లేనిపక్షంలో, ఉల్లంఘించడానికి వీల్లేని విధంగా ఉత్తర్వులు ఇస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను పరిహసించేలా స్పీకర్ చర్యలు ఉండొద్దని స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకొనేందుకు గడువును పలుమార్లు (జూలై 10, సెప్టెంబర్ 18, అక్టోబర్ 13, డిసెంబర్ 31) పొడిగించిన సుప్రీం చివరకు 10 జనవరి 2024ను డెడ్లైన్గా విధించింది. దీంతో జనవరి 10న ఠాక్రే, షిండే వర్గాల అనర్హత పిటిషన్లను స్పీకర్ పరిష్కరించారు.
మణిపూర్ మంత్రి కేసు ఇది!
మణిపూర్కు చెందిన ప్రస్తుత బీజేపీ నేత తౌనోజామ్ శ్యామ్కుమార్ సింగ్ 2017లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం అధికార బీజేపీలో చేరారు. దీంతో క్యాబినెట్లో మంత్రి హోదా దక్కింది. తమ పార్టీ టికెట్పై గెలిచి బీజేపీలో చేరిన శ్యామ్కుమార్పై అనర్హతవేటు వేయాలంటూ 2017 లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మూడేండ్లపాటు ఈ పిటిషన్పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ కేసును సుప్రీం 18 మార్చి 2020న విచారించి శ్యామ్కుమార్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆదేశించింది. అంతేకాకుండా, తాము ఉత్తర్వులు ఇచ్చే వరకూ శ్యామ్కుమార్ శాసనసభలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను అనుసరించి అనర్హత పిటిషన్ మీద స్పీకర్ మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ విధంగా స్పీకర్ అధికారాలపై కోర్టు పరోక్షంగా పరిమితులు విధించింది.
స్పీకర్ కాలయాపన చేయడానికి వీల్లేదు
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని పార్టీ ఫిరాయింపుల చట్టంపై నిర్ణయాధికారం స్పీకర్కే ఉండేది. స్పీకర్ కూడా ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి కావడం వల్ల వేరే పార్టీలకు చెందిన చట్టసభ సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు సదరు పార్టీ నుంచి ఫిర్యాదు అందితే.. స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసే విధానం సర్వసాధారణంగా మారింది. స్పీకర్ నిర్ణయం తీసుకోనిపక్షంలో దానిపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు ఇప్పటివరకు ఆస్కారం ఉండేది కాదు. సుభాశ్ దేశాయ్ కేసులో స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిర్దిష్ట గడువు విధించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వ్యక్తికి స్పీకర్ నోటీసు జారీ చేశాక రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా స్పీకర్ నిర్ణయం తీసుకోనిపక్షంలో రాజ్యాంగ ధర్మాసనాలైన హైకోర్టు/సుప్రీంకోర్టులను ఆశ్రయించవచ్చని తేల్చిచెప్పింది.
ఫిరాయింపుదారుల్లో గుబులు ..
10వ షెడ్యూల్లోని ‘పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం’ ప్రకారం.. అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకొనే అధికారం స్పీకర్కు మాత్రమే ఉంటుంది. ఈ నిర్ణయాన్ని స్పీకర్ ఈ పరిమిత సమయంలోపు తీసుకోవాలనే నిబంధన గతంలో లేదు. దీంతో రాజకీయ ప్రయోజనాలను అనుసరించి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగేది. దీనిపై దృష్టిసారించిన సుప్రీం ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని త్వరగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్లకు డెడ్లైన్లను విధిస్తున్నది. ధర్మాసనం ఆదేశాలను పాటించకపోతే, కోర్టు ధిక్కరణ కిందికి వస్తుంద న్న భావనతో స్పీకర్లు నిర్ణయం తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. మొత్తానికి మహారాష్ట్ర, మణిఫూర్ ఉదంతాలపై సుప్రీం తీర్పు పెను సంచలనమని న్యాయ నిపుణులు చెప్తున్నారు. దీంతో ఫిరాయింపుదారుల్లో గుబులు నెలకొంది.