మహబూబ్నగర్, జూన్ 21 : యోగా చేయడంతో మానసిక పరిపక్వతతోపాటు ఆరోగ్యం సిద్ధిస్తుందని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమానికి కలెక్టర్ హాజరై యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగాతో శరీరం, ఆత్మబుద్ధి వికసిస్తాయని, దీనివల్ల పనిచేసే సామ ర్థ్యం పెరుగుతుందని, అందువల్ల అందరూ యోగా అలవా టు చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయుష్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గత 5,6 సంవత్సరాలుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. పతంజలి కాలం నాటి యోగాను మనం పూర్తిగా మర్చిపోయామని, అనేక యూరోపియన్, పాశ్చాత్య దేశాల యోగాను అభ్యసిస్తున్నాయని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను గుర్తించిన అనేక కార్పొరేట్ సంస్థలు యోగాను తప్పనిసరి చేశాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో కె.స్వర్ణలత, యోగా గురువు ఆంజనేయులు, అరుణజ్యోతి తదితరులు ఉన్నారు.
పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో..
పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం బాలకేంద్రంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు విశ్వవిద్యాలయం వీసీ లక్ష్మీకాంత్రాథోడ్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతత కోసం యోగా నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పతంజలి ప్రతినిధి వెంకట్రాములు, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ నాయక్, ఆయుష్ శాఖ ప్రతినిధి ఫహీమ్, యునానీ దవాఖాన సీనియర్ మెడికల్ ఆఫీసర్ సచిన్చంద్ర, గంగాధర్, వనజారెడ్డి, లక్ష్మి, శారదాదేవి, దత్తురావు, సురేశ్ పాల్గొన్నారు. అదేవిధంగా జెడ్పీ మైదానంలో ప్రేమ్ హెల్త్క్లబ్ ఆధ్వర్యంలో ఫౌండర్ ప్రేమ్కుమార్ యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో, మహబూబ్నగర్ గ్రామర్ స్కూల్లో ఆర్కే స్పోర్ట్స్ కరాటే డూ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఫౌండర్ రవికుమార్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.