హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన దావాలో సుప్రీంకోర్టు తాజాగా ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ తదితర అంశాలపై ముందుకు వెళ్లకుండా ఏపీ సర్కార్ను నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దావా వేసిన తెలంగాణా ప్రభుత్వం.. అందులో ఏపీ సహా 13 మందిని ప్రతివాదులుగా చేర్చింది.
కానీ, ఇప్పటివరకు ప్రతివాదులకు నోటీసులను జారీచేయకపోవడంతో సుప్రీంకోర్టు ఇటీవల ఆ పిటిషన్పై చేపట్టేందుకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన అనంతరం విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా ప్రతివాదులకు నోటీసులను జారీచేసింది. సమన్లు అందిన నాటినుంచి 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలో ప్రతివాదులు హాజరుకాకపోతే చట్టప్రకారం వారి గైర్హాజరులోనే దావాను విచారించి, తీర్పు వెలువరిస్తామని సమన్లలో తెలిపింది.