Revanth Reddy | ఢిల్లీ, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎంగా శక్తిమంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ కేసు విచారణను మధ్యప్రదేశ్కు బదిలీచేయాలంటూ బీఆర్ఎస్ నేతలు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, కల్వకుంట్ల సంజయ్, మహమూద్ అలీ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ‘నిందితుడిపై ఇప్పటికే 88 క్రిమినల్ కేసులున్నాయి. గతంలో ఆయన పోలీసులను తీవ్రంగా బెదిరించారు. ఆయనే ఇప్పుడు సీఎంగా ఉన్నారు. సీఎం చేతిలోనే హోంశాఖ కూడా ఉండటంతో తెలంగాణలో కేసు విచారణ సక్రమంగా జరిగే అవకాశం లేదు. కేసు విచారణలో భాగమైన ఏసీబీ, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ వంటి అన్ని విభాగాలు నిందితుడి అధికార పరిధిలోనే ఉన్నాయి. అందువల్ల ఈ కేసు విచారణను భోపాల్ జిల్లా అండ్ సెషన్స్ కోర్టుకు బదిలీ చేయండి’ అని కోరారు. దీంతో నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వ్యక్తిగత ప్రతివాదిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి, ఉదయ్సింహ, సండ్రవెంకట వీరయ్య ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కేసును ప్రభావితం చేసే స్థితిలో నిందితుడు
2015లో టీడీపీలో ఉన్న రేవంత్రెడ్డి.. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఈ అంశంపై ఏసీబీ కేసు నమోదుచేసింది. కేసు హైదరాబాద్లో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట పెండింగ్లో ఉన్నది. ప్రస్తుతం ప్రధాన నిందితుడు సీఎం అయినందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఆసారం లేదని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సిద్ధార్థ దవే, శేషాద్రి నాయుడు వాదించారు. గతంలో ఇదే తరహా కేసుల్లో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. ప్రధాన నిందితుడే ఇప్పుడు రాష్ట్ర హోంమంత్రిగా కూడా ఉన్నందున కేసు దర్యాప్తు జరిపే పోలీసులు ఆయన కిందే పనిచేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేసు విచారణ ప్రారంభమైతే పాలకుల పక్షపాత ధోరణి ప్రభావం కేసు విచారణపై ప్రతికూలంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ధర్మాసనం, ట్రయల్పై అలాంటి ప్రభావం ఉంటే తాము చూస్తూ కూర్చోబోమని వ్యాఖ్యానించింది.
తిరిగి పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు కొనసాగిస్తూ, నిందితుడు హైకోర్టును ఆశ్రయించి కేసు విచారణను నిలుపుదల చేయటంలో విజయం సాధించారని, కేసు విచారణను నిలుపుదల చేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. తనపై 88 క్రిమినల్ కేసులు నమోదైనట్టు నిందితుడే స్వయంగా ప్రకటించారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రేవంత్రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టక ముందు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని వివరించారు. ‘మేం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో గత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించిన పోలీసు అధికారులందరినీ నగ్నంగా పరేడ్ చేయిస్తాం అని నిందితుడు బెదిరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాక్షులు కేసు విచారణకు సహకరించేందుకు భయపడే అవకాశాలుంటాయి. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉండగానే పోలీసులను బెదిరించిన నిందితుడు ఇప్పుడు సీఎం అయ్యారు. ఐపీఎస్ అధికారులనే దుర్భాషలాడిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్ర పాలక పగ్గాలు అందుకుంటే సాక్షులు రాగద్వేషాలకు అతీతంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే అవకాశాలుండవు. ఇప్పటికే ఓటుకు నోటు కేసులో అనేక కీలక సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. ఇవన్నీ కోర్టులో నిరూపణ అవ్వాలంటే కేసు విచారణ తెలంగాణ కోర్టును నుంచి భోపాల్ కోర్టుకు కేసును బదిలీ చేయాలి’ అని కోరారు.
ఆడియో, వీడియో ఆధారాలు
నిందితుడు ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని, ఈ కేసులో రేవంత్రెడ్డి జైలుకు కూడా వెళ్లారని చెప్పారు. ఇప్పడు ఆయన సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ పూర్తిగా దెబ్బతీసేలా తన ఆధీనంలోని పోలీసు అధికారులతో పనిచేయిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. అవినీతి నిరోధక చట్టం-1998లోని సెక్షన్ 12, 120-బీ, ఐపీసీ సెక్షన్ 34 కింద నిందితులపై కేసులు నమోదయ్యాయని వివరించారు. ‘రేవంత్రెడ్డి హోం శాఖను తన దగ్గరే పెట్టుకున్నారు. పోలీసులు, అవినీతి నిరోధక శాఖ, డెరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, ప్రాసిక్యూటింగ్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, ఫోరెన్సిక్స్ వంటివి హోం శాఖలో అంతర్భాగం. పోలీసు అధికారులను బదిలీచేసి తనకు అనుకూలంగా ఉండేవాళ్లను కేసు విచారణకు నియమించుకునే ప్రమాదం ఉన్నది.
ఈ పరిస్థితుల్లో పోలీసులు, ప్రాసిక్యూషన్స్ గానీ నిందితుడికి వ్యతిరేకంగా వాస్తవాలు ఎలా చెప్పగలరు? సాక్షులకు భద్రతే లేదు. భయం లేని వాతావారణంలో కేసు విచారణ జరపాలి’ అని కోరారు. రేవంత్రెడ్డి, ఇతరులు కేసు విచారణపై హైకోర్టు నుంచి స్టే పొందారని, 2015 నాటి కేసులో విచారణ ప్రారంభమే కాలేదని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. ‘2015లో కేసు మొదలైంది. 2016లో సాక్షుల వాంగ్మూలాల నమోదు మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అనవసర విషయాలపై కేసులు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా నిందితులు అడ్డుకొన్నారు. ఇప్పుడు నిందితుడైన సీఎంకు వ్యతిరేకంగా పోలీసులు, ప్రాసిక్యూషన్, ఏసీబీ, దర్యాప్తు సంస్థలు ధైర్యంగా వాస్తవాలు కోర్టుకు చెప్పలేవు. సాక్షులు కూడా భయంతో వాస్తవాలు చెప్పరు. అందుకే ఇక్కడి ఏసీబీ కోర్టుకు సమాన స్థాయిలో ఉన్న భోపాల్లోని డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టుకు కేసును బదిలీ చేయాలి’ అని న్యాయవాది కోరారు.
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ
నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ శుక్రవారం కొనసాగింది. విచారణకు హాజరు నుంచి మినహాయించాలని రేవంత్రెడ్డి కోరగా అందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సండ్ర వెంకటవీరయ్య, వేం కృష్ణకీర్తన్రెడ్డి, సెబాస్టియన్ సైతం హాజరు నుంచి మినహాయింపు పొందారు. విచారణకు ఉదయ్సింహ, మత్తయ్య జెరూసలేం హాజరయ్యారు. కేసులో తానే స్వయంగా వాదించుకుంటానని జెరూసలేం కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణను ఏప్రిల్ 8కి కోర్టు వాయిదావేసింది.
ఏపీ, కర్ణాటక వద్దు.. భోపాల్కు బదిలీచేయండి
ఓటుకు నోటు కేసును ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుకు బదిలీ చేయొద్దని పిటిషనర్లు కోరారు. ‘రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కర్ణాటకలో ఉన్నది. అక్కడి డిఫ్యూటీ సీఎంతో నిందితుడికి సన్నిహిత సంబంధాలున్నాయి. తమిళనాడు ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ మద్దతు ఉన్నది. ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్నది. అందువల్ల ఆయా రాష్ర్టాల్లో ఈ కేసు విచారణ నిష్పక్షపాతంగా జరిగే అవకాశాలు లేవు. అందుకే కేసును మధ్యప్రదేశ్లోని భోపాల్ కోర్టుకు బదిలీ చేయండి’ అని పిటిషనర్లు కోరారు.