Supreme Court | రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. విచారణ సందర్భంగా కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదించారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు సీజేఐ ధర్మాసనానికి అందజేశారు. మూడు బిల్లులను గవర్నర్ సెప్టెంబర్ నుంచి పెండింగ్లో పెట్టారని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
ఏప్రిల్ 9న గవర్నర్ సచివాలయం నివేదిక అందించారని సీజేఐ రికార్డు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం విచారణను రెండువారాలు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో గర్నవర్ తమిళిసై ఇవాళ ప్రభుత్వం పంపిన మూడు బిల్లులకు ఆమోదముద్రవేశారు. అలాగే రెండు బిల్లులను వెనక్కి పంపగా.. మరో రెండింటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. మరో మూడు బిల్లులను పెండింగ్లో పెట్టారు. వాస్తవానికి సెప్టెంబరులో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ఆమోదించింది. అదే నెల నెల 13న ఆమోదం కోసం గవర్నర్ తమిళిసైకి పంపగా.. ఇందులో జీఎస్టీ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదిస్తూ మిగతా వాటిని పెండింగ్లో పెట్టారు. తాజాగా మరో మూడు బిల్లులను ఆమోదించారు.