Supreme court | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): నియామకాల్లో నిబంధనలు పాటించని కారణంగా అవకాశాన్ని కోల్పోయిన 8 మందికి ఉద్యోగాలివ్వాలని సుప్రీంకోర్టు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్పీస్పీడీసీఎల్)ను ఆదేశించింది. తన పరిధిలోని ఏఈ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను టీఎస్పీస్పీడీసీఎల్ 2018లో చేపట్టింది.
రాతపరీక్ష నిర్వహించి మెరిట్ లిస్టును ప్రకటించింది. కొంత మందికి సమానంగా మార్కులు వచ్చాయి. వయస్సుకు ప్రాధాన్యం ఇవ్వకుండా కోర్ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చినవారిని ఉద్యోగానికి ఎంపిక చేసింది. అలా ఉద్యోగావకాశాన్ని కోల్పోయిన అభ్యర్థులు హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు వయస్సు ప్రామాణికంగా ర్యాంకులు ఇవ్వడం ద్వారా 8 మందికి ఉద్యోగాలు కల్పించాలని తీర్పునిచ్చింది. తీర్పును ఆరు వారాల్లో అమలుచేయాలని, ఈ 8 మంది సీనియారిటీని ఉత్తర్వులు ఇచ్చేనాటి నుంచే లెక్కించాలని ఆదేశించింది.