MLC Kavita : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయ్యి తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది. కవిత తరుఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఈ కేసులోనే నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు బెయిలు ఇచ్చారని, ఈడీ, సీబీఐ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు అయ్యిందని రోహత్గీ పేర్కొన్నారు. దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు. 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారన్నారు. కవిత దుర్భల మహిళ కాదు అన్నది నిజం కాదని ముకుల్ రోహత్గీ వాదించారు. కేసులో 493 మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు. సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకూ వర్తిస్తాయని ముకుల్ రోహత్గీ తెలిపారు.
కాగా కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరుఫు లాయర్ పేర్కొన్నారు. కవిత అసలు దర్యాప్తునకు సహకరించలేదన్నారు. దాంతో ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు ఎరేజ్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు వాదించారు. కాగా కవిత సాక్ష్యులను బెదిరించారని చెబుతున్నారని.. కానీ ఎక్కడా ఏ కేసూ దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్గీ తెలిపారు.
కవితకు సెక్షన్ 45 ఎందుకు వర్తించదని ఈడీ, సీబీఐ తరుఫు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ‘అరుణ్ పిళ్లైను కవిత ప్రభావితం చేశారని అంటున్నారు. కానీ ఆ సమయంలో పిళ్లై జైల్లో ఉన్నాడు. ఎలా ప్రభావితం చేస్తారు?’ అని ఈడీ తరుఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ‘అవును. ఆ సమయంలో పిళ్లై జైల్లోనే ఉన్నారు. కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు. వారి ద్వారా ప్రభావితం చేయవచ్చు’ అని ఈడీ తరుఫు న్యాయవాది ఎస్వీ రాజు వాదించారు.
కాగా సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి శుభాష్ రెడ్డి, ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితర నేతలు హాజరయ్యారు.