హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది. ఆదేశాలు అమలు చేయకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పర్యావరణ ఉల్లంఘనలను ధ్రువీకరిస్తూ రూ.24 కోట్లు జరిమానా విధించాలని గతంలో నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.
ప్రాజెక్టు వ్యయం ఆధారంగా గతంలో రూ.242 కోట్లు పెనాల్టీ విధించింది. అనంతరం ఎన్జీటీ తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. నిపుణుల కమిటీ ధ్రువీకరించిన జరిమానా రూ.24 కోట్లను చెల్లించాల్సిందేనని, 17 అక్టోబర్ 2022న ఏపీ ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఇక రూ.242 కోట్లు పెనాల్టీ విధించాలా? లేదా? అన్నదానిపై విచారణ కొనసాగిస్తామని కోర్టు తెలిపింది. జరిమానా చెల్లింపుపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. పురుషోత్తపట్నం రైతులకు ఆరేండ్లుగా నష్టపరిహారం ఇవ్వడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది కే శ్రవణ్కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జోషీమఠ్ తరహాలో పోలవరం వద్ద భూమిపై చీలికలు వచ్చాయని న్యాయమూర్తులు సంజీవ్ కన్నా, సుందరేశ్ల ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు సుప్రీం వాయిదా వేసింది.