హైదరాబాద్ : తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు . శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు గువ్వల బాలరాజు, పద్మాదేవేందర్ రెడ్డి, జాజుల సురేందర్, జాఫర్ హుస్సేన్, దానం నాగేందర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు.
సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల పెన్షన్లకు ఇబ్బంది వస్తున్న చోట సమస్యను పరిష్కారిస్తుమని పేర్కొన్నారు. ఎక్కడా కూడా ట్రాక్టర్, కారు చూసి పెన్షన్లు ఆపడం లేదని, వారి ఆర్థిక పరిస్థితిని బట్టే పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు నెలనెలా మరిన్ని సదరం క్యాంపులు పెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో 9,08,498 మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సంవత్సరానికి పెన్షన్ల కోసం రూ. 861 కోట్లు ఇవ్వగా ప్రస్తుతం తెలంగాణలో రూ. 12వేల కోట్ల ను బడ్జెట్లో కేటాయించామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్రామంలో వెయ్యి మంది ఉంటే 60, 70 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయని వెల్లడించారు. తెలంగాణలో వెయ్యి మందికి గ్రామంలో ఆరు వందల నుంచి ఏడువందల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. 3వేలు ఎందుకు ఇవ్వడం లేదు ?
అధికారంలోకి వస్తే రూ. మూడు వేలు ఇస్తామని బీజేపీ నాయకులు మాయమాటలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ. మూడు వేలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మణిపూర్లో రూ. 200 నుంచి రూ. 500 , అస్సాంలో రూ. 250 నుంచి రూ. 550 , నాగాలాండ్ లో రూ. 200, మిజోరాంలో రూ. 300 మాత్రమే ఇస్తున్నారన్నారు.
గొప్పలు చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ లో పెన్షన్ రూ . వెయ్యి , మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రాలైన గుజరాత్ లో వెయ్యి నుంచి రూ. 1,250 వరకు మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు కావడంతోపెన్షన్ పొందే భార్యాభర్తలలో ఒకరు చనిపోతే వెంటనే మిగిలిన వారికి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి. సంబంధిత మంత్రికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.