ప్రజాస్వామ్య పరిరక్షణకే యశ్వంత్సిన్హాకు మద్దతు
తెలంగాణ నుంచే తిరుగుబాటు మొదలవుతుంది
నాడు దళితుల బాగుకోసమే కోవింద్ అన్నారు..
ఇన్నేండ్లలో దళితుల కోసం మోదీ ఏం చేశారు?
ఇప్పుడు గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము అంటున్నారు..
దేశవ్యాప్తంగా గిరిజనులు బాగుపడిపోయినట్టేనా?
తెలంగాణ ప్రగతిపై కేంద్రం శ్వేతపత్రం ప్రకటించాలి
పైసా ఎక్కువిచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా
మీడియాతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ నిరంకుశ విధానాలు, అప్రజాస్వామిక వైఖరి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచే తిరుగుబాటు మొదలుకావచ్చని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి.. నరేంద్రమోదీ రాజ్యాంగం నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్సిన్హాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, జూలై 18 న జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ యశ్వంత్సిన్హాకు ఓటేయాలని నిర్ణయించిందని చెప్పారు. అవసరమనుకొంటే ఇతర పార్టీలతో కలిసి యశ్వంత్ గెలుపు కోసం ప్రయత్నిస్తామన్నారు. సోమవారం రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వత్ సిన్హా నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కేటీఆర్ టీఆర్ఎస్ పక్షాన హాజరయ్యారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు రంజిత్రెడ్డి, పీ రాములు, కే ప్రభాకర్రెడ్డి, వెంకటేశ్నేత, రవిచంద్ర తదితరులతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ద్రౌపది ముర్ము ఏం చేశారు?
ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము పట్ల వ్యక్తిగతంగా తమకేం వ్యతిరేకత లేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ఆమె మంచివారే కావచ్చు కానీ.. గిరిజన అభ్యర్థి అనో.. మహిళా అభ్యర్థి అనో టోకెనిజం, సింబాలిజం సరైంది కాదన్నారు. భీష్ముడు మంచివాడే అయినా.. కౌరవుల పక్షాన ఉండటం వల్ల పరాభవం తప్పలేదని గుర్తుచేశారు. ‘జనవరి 2, 2006లో ఒడిశాలోని కళింగనగర్లో స్టీల్ ప్లాంట్ కడుతుంటే నిరసించినందుకు అక్కడి ప్రభుత్వం 13 మంది గిరిజనులను కాల్చిచంపింది. అప్పటి ఒడిశా ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా, ద్రౌపది ముర్ము ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి కనీసం సానుభూతి వ్యక్తంచేయలేదు. తమ గిరిజనులకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు’ అని గుర్తుచేశారు. నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే.. గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా కేంద్రం రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్చేశారు. విభజన చట్టంలో చెప్పిన గిరిజన వర్సిటీ ఏర్పాటు అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాలోని 7 గిరిజన మండలాలను పోలవరంలో ముంచిన బీజేపీకి వారిపై ప్రేమ ఎక్కడుందని నిలదీశారు. రాష్ట్రపతి అభ్యర్థిని అడ్డుపెట్టి రాజకీయం చేస్తామని బీజేపీ అంటే విపక్షాలు.. మీడియా అందులో కొట్టుకుపోతాయనుకొంటే పొరపాటేనన్నారు.
ప్రజాస్వామ్యానికి దన్ను యశ్వంత్ సిన్హా
బీజేపీ నిరంకుశ, నియంతృత్వ, అప్రజాస్వామిక వైఖరిని నిరసించేందుకే విపక్షాల తరఫున యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా పెడుతున్నామని మమతా బెనర్జీ, శరద్పవార్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారని కేటీఆర్ తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు యశ్వంత్ అభ్యర్థిత్వాన్ని సమర్థించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని చెప్పారు. రాజకీయ భావ దారిద్య్రానికి బీజేపీ ప్రతీకగా మారిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ‘బీజేపీ రాష్ట్ర పార్టీకి కూడా కేసీఆర్ బొమ్మ పెట్టకపోతే నడవలేని దుస్థితి అన్నారు. కేసీఆర్ బొమ్మ పెడితే తప్ప ఆ పార్టీ దిక్కు మర్రి చూసేవాడు లేడన్నారు. బీజేపీకి చైతన్యం, ఇంగితం, సిగ్గు లేవని, తెంపరితనానికి ఆ పార్టీ పరాకాష్ట అని మండిపడ్డారు. తామూ బీజేపీ నేతల మాదిరి ఉంటే.. మోదీ బొమ్మ పెట్టి ప్రతి నియోజకవర్గంలో చెప్పుల దండలేసి.. గాడిద మీద ఊరేగించొచ్చని.. కానీ, తమది అలాంటి నీచ సంస్కృతి కాదన్నారు.
రాజ్యాంగం అభాసుపాలు
మోదీ ప్రధాని అయిన తర్వాత 8 రాష్ర్టాల్లో మెజార్టీ లేకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకొన్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగ వ్యవస్థలను నియంత్రణలో పెట్టుకొని మోదీ ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. అయితే జుమ్లా.. లేదంటే హమ్లా ఈ రెండింటిలో ఏదో ఒకటి చేయటం మోదీకి పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీలను వేటకుక్కల్లా ఉసిగొల్పటం, వారిని వేధించైనా లొంగదీసుకోవాలనే చిల్లర రాజకీయం మోదీదని నిప్పులు చెరిగారు. కొన్ని మీడియా సంస్థలకు కూడా ఈ అన్యాయాన్ని చూపెట్టే దమ్ములేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు తిరగబడే రోజు వస్తదన్నారు. ‘మోదీ రాజ్యాంగమే నడవాలంటే.. ఎక్కడో ఒక్క దగ్గర తిరుగుబాటు వస్తది. అది బహుశా తెలంగాణ నుంచే స్టార్ట్ అవుతదేమో. ఆ ధిక్కార స్వరం కేసీఆర్ రూపంలోనో.. మరో రూపంలో ఈ దేశాన్ని చైతన్యం చేసే రోజు వస్తదేమో’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
ఎక్కువ ఇచ్చామని రుజువు చేస్తే రాజీనామా చేస్తా..
‘అప్పు ఇచ్చిన ప్రతివాడు నేనే గొప్ప అంటే ఎట్లా? వీధి వ్యాపారాలకు అప్పు ఇచ్చి.. దాన్ని నేనే చేశానని మోదీ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటాడు. ఇంతకంటే భావదారిద్య్రం మరోటి ఉండదు. వాళ్లేదో ఉద్ధరించారనుకొంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. తెలంగాణకు విద్య, వైద్యం, గామీణాభివృద్ధి రంగాల్లో ఇంతిచ్చామని రుజువు చేస్తే.. తెలంగాణ కట్టిన దానికంటే కేంద్రమే ఎక్కువిచ్చిందని రుజువు చేస్తే.. ఈ ఢిల్లీ గడ్డ మీది నుంచే నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఇంటికి పోత’ అని మంత్రి కేటీఆర్ సవాలు విసిరారు.
దళితుల బతుకులు మారాయా?
గతంలో రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినప్పుడు దళితుడు రాష్ట్రపతి అవుతున్నారని చెప్పారని.. దీంతో దళితుల బతుకులు మారిపోయాయా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయం అంటే టోకెనిజం.. సింబాలిజంతో ఓట్లు దండుకోవటం కాదన్నారు. ‘మేం దళితబంధు పథకం పెట్టినం. దళితులకు మీరేం చేశారో చెప్పండి?’ అని ప్రశ్నించారు. ఈ ఎనిమిదేండ్లలో 45 ఏండ్ల కాలంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగ రేటుకు చేరుకోవడం, 30 ఏండ్లలో ఎన్నడూ లేనంత ద్రవ్యోల్బణానికి దిగజారడం, ప్రపంచంలోనే అత్యధిక గ్యాస్ రేటున్న దేశంగా మార్చడమే మోదీ సర్కారు సాధించిన ఘనత అన్నారు. అన్నింటికీ మించి లక్ష కోట్ల అప్పులు చేశారని.. ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో కోటి లక్షల కోట్లకు చేరుకోవచ్చని మండిపడ్డారు. తెల్లారి లేస్తే.. హలాల్.. హిజాబ్ తప్ప నిర్మాణాత్మకమైన పని చేసింది లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టింది తెలంగాణ. దేశంలో మీరేదైనా ప్రాజెక్టు కట్టారా? జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చిన పోలవరం పూర్తిచేశారా? ఏం మొఖం పెట్టుకొని వస్తున్నవు?’ అని మోదీని కేటీఆర్ నిలదీశారు. జవాబులు చెప్పటం చేతగాక కుటుంబ పాలన.. అవినీతి అనే ఫాల్తు మాటలు తప్ప ఒకటంటే ఒకటి అర్థవంతమైన మాట చెప్పగలడా మోదీ? అని ప్రశ్నించారు. ‘మోదీ ఒత్తిడి వల్లే అదానీకి రూ.6,000 కోట్ల ప్రాజెక్టు ఇచ్చామని శ్రీలంకలో అక్కడి మంత్రి స్వయంగా చెప్పిండు. దీనిపై మోదీ ఎందుకు మాట్లాడరు? మీడియా ఎందుకు రాయదు? విచారణ ఎందుకు జరగదు? అందుకే అంటున్నాం.. రాజ్యాంగం అంబేద్కర్ది నడుస్తలేదు. మోదీ రాజ్యాంగం నడుస్తున్నది. అందుకే అప్రజాస్వామిక, నియంతృత్వ, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా గొంతు విప్పాలి. తెలంగాణ నుంచే ఆ తిరుగుబాటు మొదలవ్వాలి’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.
బీజేపీ ఏం పీకి పందిరేసింది?
జాతీయ కార్యవర్గ సమావేశాల పేరుతో మోదీ అండ్ కంపెనీ హైదరాబాద్ వస్తున్నదని, 8 ఏండ్లలో రాష్ర్టానికి, దేశానికి ఏం పీకి పందిరేసిందో చెప్తే బాగుంటుందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. గుజరాత్కు మూడుసార్లు సీఎంగా పనిచేసి.. ఈ రోజుకు కూడా కరెంట్ లేకుండా చేసిన వ్యక్తి సమర్థుడా? అసమర్థుడా? ఆలోచించాలన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపది సొంత ఊర్లోనే కరెంట్లేదని గుర్తుచేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా మోదీ నెరవేర్చారా? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజలు గత 8 ఏండ్లలో పన్నుల రూపంలో కేంద్రానికి కట్టింది రూ.3,65,797 కోట్లు. దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా? తెలంగాణ దేశానికి ఎక్కువ ఇచ్చిందా? ఈ విషయంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న జాతీయ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. తెల్లారిలేస్తే వాట్సాప్లో, ఫేస్బుక్లో ఉండే బీజేపీ నేతలకు ఏం తెలుసని నిలదీశారు. దేశంలో 28 రాష్ర్టాల్లో జాతి నిర్మాణంలో 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉన్నందుకు గర్వంగా ఉన్నదని చెప్పారు. గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో తెలంగాణ సొమ్ము ఖర్చుపెడుతున్నారే కానీ కేంద్రం తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని స్పష్టంచేశారు. ‘రూపాయి మనం కడితే వెనక్కి వస్తున్నది 46 పైసలు మాత్రమే. 54 పైసలు ఇతర ప్రాంతాల్లో ఖర్చు అవుతున్నది’ అని వివరించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మోదీ సహా బీజేపీ నాయకత్వం రాష్ర్టానికి వచ్చి ‘తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పండి.. సెల్యూట్ కొట్టండి. నేడు తెలంగాణ ప్రజలుగా మీరు కడుతున్న పన్నులతో జాతి నిర్మాణం జరుగుతున్నది.. జాతికి మేలు జరుగుతున్నదని చెప్పండి. అంతే కానీ పిచ్చి ప్రేలాపనలు పేలితే సహించేది లేదు’ అని తేల్చిచెప్పారు.