హైదరాబాద్, నవంబర్23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే బీసీలు మద్దతు ఇవ్వాలని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణలోని బీసీ మేధావులు, విద్యార్థులు, కులసంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్ వైపు నిలవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి జాతీయ పార్టీలతో బీసీలకు ఇప్పటివరకూ ఒరిగిందేమీ లేదని, ప్రాంతీయ పార్టీలతోనే బీసీ సమాజం కలిసి నడవాలని కోరారు. ఎన్నికలప్పుడే కాంగ్రెస్, బీజేపీకి బీసీలు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత గాలికొదిలేస్తాయని ఆరోపించారు.
బీసీని సీఎంను చేస్తామని ప్రకటించిన బీజేపీది ఎన్నికల స్టంట్ అని పేర్కొన్నారు. కులగణన, బీసీ ప్రత్యేక మంత్రిత్వశాఖ తదితర అంశాల్లో బీసీలను బీజేపీ వంచించిందని మండిపడ్డారు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నా కులగణనను చేయలేదని, బీసీల సంక్షేమానికి పాటుపడిందీ లేదని మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న, ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్కే తెలంగాణ బీసీ సమాజం మద్దతుగా నిలవాలని కోరారు.