వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 20: వ్యవసాయ యూనివర్సిటీ భూములతో వ్యాపారం తగదని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని సీఎం రేవంత్రెడ్డి వెంటనే విరమించుకోవాలని, లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీని శనివారం ఆయన సందర్శించి విద్యార్థుల నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 55ను తక్షణం రద్దు చేసి తెలంగాణకు గుండెకాయ వంటి వర్సిటీని కాపాడాలని సీఎంకు సూచించారు. విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.
40 ఏండ్లకు పైగా ఇక్కడ ఉన్న వృక్ష సంపదను నాశనం చేయడం కంటే నీచ సంస్కృతి మరోటి ఉండదని మండిపడ్డారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన మనమే రైతు మెడనొక్కినట్టు అవుతుందని పేర్కొన్నారు. ఔషధ మొక్కలు, విత్తన భాండాగారాన్ని నాశనం చేసి చరిత్ర హీనులుగా మిగలొద్దని సూచించారు. గతంలో బడానేతలు కబ్జా చేసిన కేబీఆర్, ఇందిరాపార్క్ స్థలాల్లో హైకోర్టు నిర్మించాలని సలహా ఇచ్చారు. రాష్ర్టాన్ని నాశనం చేయాలని చూస్తే సహించబోమని తేల్చిచెప్పారు. విద్యార్థులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ర్యాలీగా బయోడైవర్సిటీ పార్కుకు వెళ్లి మొక్కలు నాటారు.
నినాదాలతో మార్మోగిన ప్రాంగణం
యూనివర్సిటీ భూములను కాపాడాలంటూ విద్యార్థులు చేపట్టిన నిరసన శనివారం 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు చేసిన నినాదాలతో యూనివర్సిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ‘సేవ్ యూనివర్సిటీ ల్యాండ్స్’, ‘సేవ్ ఫార్మర్స్’, ‘స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్’ అంటూ నినదించారు. పాలెం, వరంగల్, సిరిసిల్ల, అశ్వారావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డిలోని వ్యవసాయ కళాశాలల యూజీ, పీజీ, పీహెచ్డీ విద్యార్థులు కూడా నిరసనలకు దిగారు. జీవో నంబర్ 55ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనల్లో వర్సిటీ కళాశాల విద్యార్థి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, శంకర్నాయక్, రాకేశ్ పాల్గొన్నారు.