హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి భోజనాల సరఫరా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూలేనివిధంగా వారం రోజులుగా సీఎం కార్యాలయానికి భోజనాల సరఫరాను సదరు కాంట్రాక్టర్ నిలిపివేశారు. ముఖ్యమంత్రిని కలువడానికి వచ్చే అతిధులు, ముఖ్యమంత్రితో నేరుగా పనిచేసే ఆయన కార్యాలయ సిబ్బందికి ప్రతిరోజూ భోజనాలు పెడుతుంటారు. ఉదయం, మధ్యాహ్నం సమయంలో టిఫిన్లు, స్నాక్స్ కూడా పెడుతుంటారు. వీటన్నింటిని సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఒక కాంట్రాక్టర్ ఉంటారు. అయితే, ఈ క్యాటరింగ్ సర్వీసుపై కూడా ముఖ్యనేత అనుచరుల కన్నుపడింది. పాత క్యాటరింగ్ కాంట్రాక్టర్ను తొలగించి, మరో కాంట్రాక్టర్కు అప్పగించారు. అయితే, క్యాటరింగ్ సర్వీస్కు సంబంధించిన ఒక్క బిల్లు కూడా రాకపోవడంతో సదరు కాంట్రాక్టర్ తనవల్ల కాదని సీఎంవో అధికారులతో చెప్పాడు. అధికారులేమో ఏదో ఒకటి చేసి క్యాటరింగ్ సర్వీసును కొనసాగించాలని ఆయనను బతిమాలుకున్నారు.
దీంతో ఏడాదిన్నరగా సరఫరా చేస్తూనే ఉన్నాడు. అయితే, ఏడాదిన్నరగా బిల్లులు మాత్రం రాలేదు. రోజుకు సుమారు మూడు వందల నుంచి ఐదు వందల మందికి భోజనాలు, స్నాక్స్ సరఫరా చేసేవారు. ఒక్కొక్క ప్లేట్ భోజనం (స్నాక్స్తో కలిపి) రూ.500 ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఏడాదిన్నరలో ఇప్పటివరకు ఒక్క నెల కూడా క్యాటరింగ్ కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించలేదు. దీంతో ఆయన ఇకపై సీఎంవోకు భోజనాలు సరఫరా చేయలేనని చేతులెత్తేశారు. వారం రోజులుగా సరఫరా చేయడంలేదు. ఈ విషయాన్ని ఎవరికి ఎలా చెప్పాలో తెలియడంలేదని ఓ అధికారి ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. తొలుత మంచి నాణ్యతతో తమకు భోజనాలు అందేవని, కానీ, బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యత తగ్గించారని, మెనూ కూడా తగ్గించారని, చివరకు మొత్తానికే సరఫరా ఆపేశారని పేర్కొన్నారు.