గజ్వేల్/సిద్దిపేట అర్బన్/సిద్దిపేట రూరల్/కొండాపూర్, సెప్టెంబర్ 12: తెలంగాణలో మిషన్ భగీరథ, స్వచ్ఛబడి, స్టీల్బ్యాంకు పనులు బాగున్నాయని యునిసెఫ్ గ్లోబల్ డెలిగేషన్ బృందం ప్రశంసించింది. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చింది. మంగళవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలో, సిద్దిపేట రూరల్ మండలంలో, గజ్వేల్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో యునిసెఫ్ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పంపుహౌస్తోపాటు స్వచ్ఛబడి, స్టీల్బ్యాంకు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పలు అభివృద్ధి పనులను యునిసెఫ్ బృందం పరిశీలించింది.
ఈ బృందంలో జర్మనీ, థాయిలాండ్, వర్జీనియా, పర్షియా, లండన్, అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, కెన్యా, బ్రెజిల్, టర్కీ, స్పెయిన్, బంగ్లాదేశ్, మలేషియా, మెక్సికో, జెనీవా తదితర దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు ఉన్నారు. తొలుత గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద మిషన్ భగీరథ ప్లాంట్ను బృందం సభ్యులు సందర్శించారు. నాలెడ్జ్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని చూసి సంతోషం వ్యక్తం చేశారు.
మూడేండ్లలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసి.. ఇంటింటికీ శుద్ధిచేసిన మంచినీళ్లను సరఫరా చేస్తున్నట్టు ఎస్ఈ విజయ్ప్రకాశ్ వారికి తెలిపారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మిషన్ భగీరథను ప్రారంభించినట్టు బృంద సభ్యులకు వివరించారు. మిషన్ భగీరథ నీటితో తాగునీటి సమస్య తీరడంతోపాటు శుద్ధిజలాల వాడకంతో సీజనల్ వ్యాధులు చాలా తగ్గాయని చెప్పడంతో యునిసెఫ్ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. సిద్దిపేట రూరల్ మండలంలోని రాఘవాపూర్, చిన్నగుండవెల్లి గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు పాటిస్తున్న హ్యాండ్వాష్ విధానాన్ని, విద్యార్థులు వినియోగిస్తున్న టాయిలెట్లను పరిశీలించి పరిశుభ్రతపై కితాబిచ్చింది.
గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిత్యం సేకరిస్తున్న తడి, పొడి చెత్త విధానం గురించి తెలుసుకున్నారు. అంగన్వాడీల ద్వారా మహిళలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని బృందం సభ్యులు పరిశీలించారు. సిద్దిపేట పట్టణంలో యునిసెఫ్ బృందానికి జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, మున్సిపల్ కమిషనర్ సంపత్కుమార్ స్వాగతం పలికారు. ముందుగా యూనిసెఫ్ బృందం సభ్యులు స్వచ్ఛబడిలో ఉన్న క్లాత్ బ్యాంక్ను పరిశీలించారు. అన్నింటినీ పరిశీలించిన యూనిసెఫ్ బృందం సభ్యులు చప్పుట్లు కొట్టి సంతోషం వ్యక్తం చేశారు.