జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గత బీఆర్ఎస్ పాలనలో రోగులకు వరంగా ఉన్న భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖాన కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగులు రమణారెడ్డి వద్దకొచ్చి దవాఖానలోని సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మీడియాతో మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా ప్రజలతో పాటు, సమీపంలోని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చే రోగులకు అత్యవసర వైద్య సేవలందించాల్సిన జిల్లా జనరల్ దవాఖాన నేడు సమస్యలకు నిలయంగా మారిందని మండిపడ్డారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోగులకు అన్ని వసతులు కల్పిం చి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించామని గుర్తుచేశారు. అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిత్యం సమీక్షలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారని వివరించారు. జిల్లా జనరల్ దవాఖానకు వైద్యం కోసం వచ్చిన రోగులకు సరైన సేవలు అందించకుండా ఇతర దవాఖానలకు రిఫర్ చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
రోగుల బాధలు విం టుంటే ఇది ప్రభుత్వ దవాఖాననా…? లేక రిఫరల్ సెంటరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 9నెలలుగా మంచినీటి సమస్య నెలకొందని, ఐదు రోజుల నుంచి పూర్తిగా అందడం లేదన్నారు. దీంతో డబ్బులు వెచ్చించి బయట తాగునీరు కొనుగోలు చే యాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.