హైదరాబాద్, డిసెంబర్ 11(నమస్తే తెలంగాణ): జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుతో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతున్నదని, అనవసరంగా కేసులు బయటకు రిఫర్ చేయొద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్రావు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ దవాఖానలు, బోధనాస్పత్రుల్లో అవసరమైన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవల విభాగంలో తగినంత సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ బోధనాస్పత్రుల(టీచింగ్ హాస్పిటల్స్) పనితీరుపై నెలవారీ సమీక్ష సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. అన్ని టీచింగ్ హాస్పిటళ్లల్లో బ్రెయిన్డెడ్ డిక్లరేషన్ బృందాలు ఏర్పాటు చేసి, అవయవ మార్పిడిని ప్రోత్సహించాలని సూచించారు. దవాఖానల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని, ప్రతి సోమవారం ఆర్ఎంవోలు, సూపరిం టెండెంట్లు వీటి పనితీరుపై సమీక్షించాలని ఆదేశించారు. ఇప్పటికే ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, నర్సులకు నిమ్స్లో శిక్షణ ఇచ్చామని, ప్రతి దవాఖానలో ఇన్ఫెక్షన్ సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. ఎయిర్ చెకింగ్తోపాటు, స్టెరిలైజేషన్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. అవసరమైతే రాత్రి వేళల్లోనూ పోస్టుమార్టం చేయాలని, ‘హర్ సే’ వాహనాన్ని అందుబాటులో ఉంచి, పార్థివదేహాలను ఉచితంగా ఇంటికి చేర్చాలని ఆదేశించారు.
అన్ని మందులు ఇచ్చి పంపాలి
రోగి డిశ్ఛార్జి సమయంలో వైద్యులు రాసిన మందులన్నీ ఇచ్చి పంపాలని మంత్రి స్పష్టం చేశారు. డబ్బులు పెట్టి బయట కొనే పరిస్థితి రాకూడదని, ప్రతి దవాఖానలో 3 నెలల బఫర్ స్టాక్ మెయింటేన్ చేయాలని.. దీనిపై ఆర్ఎంవోలు, సూపరింటెండెంట్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వైద్య పరికరాలు పాడైతే గంటల్లోనే మరమ్మతు చేసేలా పీఎంయూ విధానం తీసుకొచ్చామని, ఫోన్ లేదా ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇస్తే వెంటనే రిపేర్ చేస్తారని వెల్లడించారు.
టీచింగ్ హాస్పిటళ్లకు 800 మంది
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో టీచింగ్ హాస్పిటల్కు 25-30 మంది చొప్పున 800 మంది సీనియర్ రెసిడెంట్లను కేటాయించామని, వారి సేవలను ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. సిజేరియన్లను నియంత్రించాలని, వైద్యుల సూచన మేరకే ఆపరేషన్లు జరగాలని, బర్త్ ప్లాన్ సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇటీవల గాల్బ్లాడర్ స్టోన్స్ కేసులు అధికంగా వస్తుండటంతో సులువుగా, అధునాతన చికిత్స అందించేలా గాంధీ, ఉస్మానియా వైద్యులు ప్రణాళిక రూపొందించాలని అన్నారు. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ) కమిషనర్ అజయ్కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.