హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట: మాతాశిశు సంరక్షణలో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మాతా శిశు మరణాలు తగ్గించడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని దీని వెనుక సీఎం కేసీఆర్ కృషి, వైద్యసిబ్బంది శ్రమ ఉన్నదని చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్ గాంధీ దవాఖానలో రూ.52 కోట్లతో నిర్మించిన 200 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్కేర్ హాస్పిటల్ (ఎంసీహెచ్), రూ.1.20 కోట్లతో ఆధునికీకరించిన డైట్కిచెన్, 33 నియోనాటల్ అంబులెన్స్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా గాంధీలో సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ను ప్రారంభించడం సంతోషకరమని చెప్పారు. దీంతో గాంధీలో మాతా శిశు సంరక్షణ పడకల సంఖ్య 500కు పెరిగిందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మాతృత్వ మరణాల రేటును 92 నుంచి 43కు, శిశు మరణాల రేటును 39 నుంచి 21కి తగ్గించగలిగామని వివరించారు. రాష్ట్రంలో శిశు మరణాల రేటు జాతీయ సరాసరి 28 కంటే తక్కువగా ఉన్నదని తెలిపారు. గాంధీ తరహాలోనే త్వరలో నిమ్స్లో 200, తర్వాత అల్వాల్ టిమ్స్లో 200 పడకల సామర్థ్యంతో ఎంసీహెచ్లను ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రసవం సమయంలో, ఆ తర్వాత మహిళలకు, శిశువుకు ఆరోగ్య సంరక్షణ సేవలు ఎంసీహెచ్లో అందుతాయని చెప్పారు. గర్భిణులకు డయాలసిస్ సేవల అవసరమైతే బెడ్ వద్దనే అందించేలా ఎంసీహెచ్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఒకవైపు డయాలసిస్ చేస్తూనే మరోవైపు ప్రసూతి చికిత్స అందించవచ్చని, అత్యాధునిక యంత్రాలను అందుబాటులో ఉంచామని వివరించారు.
క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే నవజాత శిశువులను అత్యవసర సమయాల్లో సూపర్స్పెషాలిటీ కేంద్రాలకు తరలించడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా నియోనాటల్ అంబులెన్స్లను ప్రారంభించినట్టు హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 నియోనాటల్ అంబులెన్స్లు ఆదివారం నుంచే అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. వీటి నిర్వహణకు ఏడాదికి రూ.8.07 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఈ అంబులెన్స్లో నియోనాటల్ ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్, నియోనాటల్ ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, ఆక్సిజన్, హ్యూమిడిఫైయర్, పల్స్ఆక్సీమీటర్, సుదీర్ఘ బ్యాటరీతో సిరంజి పంప్ తదితర సౌకర్యాలు ఉన్నాయని వివరించారు.
న్యూట్రిషన్ కిట్స్.. కేసీఆర్ కిట్స్
మాతా శిశువుల సంరక్షణ చాలా ప్రధానమైనదని, ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన కీలక అంశమని హరీశ్రావు పేర్కొన్నారు. తల్లీ బిడ్డల ఆరోగ్యంపైనే కుటుంబ ఆరోగ్యం, రాష్ట్ర, దేశ ఆరోగ్య స్థితిగతులు ఆధారపడి ఉంటాయని వివరించారు. తల్లీ బిడ్డల సంరక్షణ కోసం సీఎం కేసీఆర్ పలు ఆరోగ్య పథకాలను ప్రవేశపెట్టారని, బిడ్డ కడుపులో పడ్డప్పుడు న్యూట్రిషన్కిట్, బిడ్డ పుట్టగానే కేసీఆర్కిట్ను అందజేస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటివరకు 14 లక్షల మందికి కేసీఆర్ కిట్లు, 6 లక్షల మంది గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్స్ అందజేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 300 అమ్మఒడి వాహనాల ద్వారా 30 లక్షల మంది గర్భిణీలు సేవలు పొందారని తెలిపారు. 350 ప్రసూతి కేంద్రాలను ఆధునికీకరించడంతోపాటు 350 మందికి మిడ్వైఫరీ శిక్షణ ఇచ్చామని, ప్రసూతి కేంద్రాల్లో 56 టిఫాసాన్ యంత్రాలను సమకూర్చామని చెప్పారు. రాష్ట్రంలో ఎంసీహెచ్ కేంద్రాలను 6 నుంచి 28కి, న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్లు 56కు పెంచామని వెల్లడించారు. ఆరోగ్య మహిళ ద్వారా 272 ఆరోగ్యకేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు 8 రకాల వైద్యసేవలు అందిస్తున్నట్టు వివరించారు. పేట్లబుర్జు, గాంధీ దవాఖానల్లో ఇన్ఫర్టిలిటీ సెంటర్, గాంధీలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.
గాంధీకి ఐఎస్వో రావడం అభినందనీయం
క్వాలిటీ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్లో తొలిసారిగా గాంధీ దవాఖానకు ఐఎస్వో సర్టిఫికెట్ రావడం పట్ల మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ సందర్భంగా ఐఎస్వో సర్టిఫికెట్ను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుకు అందజేశారు. మొదటిసారి గాంధీలో లివర్ రిట్రీవర్ చేసి, ఉస్మానియా దవాఖానలోని రోగికి అందిస్తున్నట్టు తెలిపారు.
మరింత వేగంగా ఎమర్జెన్సీ సేవలు
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అత్యవసర సేవలను మరింత వేగంగా అందించేందుకు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఈఆర్సీ)ను ప్రారంభించినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. 108, 102, 104 హెల్ప్లైన్లను ఇకపై ఈఆర్సీ నుంచే నిర్వహిస్తారని చెప్పారు. హైదరాబాద్ వెంగళ్రావునగర్లోని ఐఐహెచ్ఎఫ్డబ్ల్యూలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఆర్సీని మంత్రి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఈఆర్సీలో 110 మందికిపైగా సిబ్బంది 24 గంటలు పనిచేస్తారని చెప్పారు. ప్రస్తుతం మూడు రకాల వాహనాలు కలిపి మొత్తం 776 అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండాలని, రాష్ట్రంలో 75 వేల మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉన్నదని వెల్లడించారు. ఫోన్ చేసిన పావుగంటలో అంబులెన్స్ చేరుతున్నదని, ఈఆర్సీతో ఈ టైం మరింత తగ్గుతుందని చెప్పారు.
ఈఆర్సీ ప్రధాన లక్ష్యాలు..