Summer | హైదరాబాద్ : రాష్ట్రంలో భానుడు భగభగలతో మంట పుట్టిస్తున్నాడు. మండే ఎండలతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. సూర్యుడి సెగ తట్టుకోలేక రోజు చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. బుధవారం రాష్ట్రంలో ఇద్దరు వడదెబ్బకు గురై మృతి చెందారు. వారం రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దాదాపు 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఎండలు మరింత దంచికొట్టనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మే 31 వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
నిప్పుల కొలిమిలా హైదరాబాద్ నగరం మారింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నగర రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40కి పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోవదవుతుంటే మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఈ నెల 19 నుంచి వేడి వాతావరణంతో పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని నాగరత్న చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో 2 నుంచి 3 డిగ్రీల పెరుగుదల ఉంటుందని తెలిపారు.