Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల ప్రభావం కొనసాగుతోంది. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అప్పుడప్పుడు కాస్త ఆకాశం మేఘావృతమై ఉండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని ముత్తారంలో అత్యధికంగా 43.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గచ్చిబౌలిలో అత్యధికంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాబోయే మూడు రోజుల వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 37 డిగ్రీల నుంచి 39 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.
ఈ నెల 29 నుంచి 30వ తేదీ మధ్య రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.