Schools Reopen | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరింది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు మోగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు తిరిగి బడిబాటపట్టనున్నారు. ఇన్నాళ్లు సెలవుల మజాను ఆస్వాదించి.. ఆటలు పాటలతో గడిపిన చిన్నారులంతా సోమవారం నుంచి చదువుల ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేసే, విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు పాఠశాల విద్యాశాఖ పటిష్ఠ కార్యాచరణను సిద్ధం చేసింది. నూతన విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాలతో పాఠశాల విద్య, సమగ్ర శిక్ష, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సైట్)లకు అధికారులు వేర్వేరు ప్రణాళికలను రూపొందించారు. వాటిని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించి ఆమోదం తీసుకున్నారు. నిరుడు 1-8 తరగతుల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి దాన్ని 9వ తరగతికి విస్తరించనున్నది.
పాఠశాలల సెలవులను 19వ తేదీ వరకు పొడిగించారని వస్తున్న వార్తలు అవాస్తవమని, సెలవులను ప్రభుత్వం పొడిగించలేదని విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ స్పష్టం చేశారు. తుపాను, భారీ వర్షాల నేపథ్యంలో సెలవులు పొడించారంటూ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్క్యూలర్ ఫేక్ అని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె స్పష్టం చేశారు. రేపటి నుంచే బడులు పునఃప్రారంభమవుతాయని వివరించారు.