హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు వేసవి సెలవులు పొడిగించాయి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలుండటం, హాస్టళ్లల్లో నీటి కొరత వంటి సమస్యల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మే 1 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించాయి. సోమవారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉన్నది.
ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలు జూన్ 6 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశాయి. జూన్ 7 ఆదివారం కాగా, జూన్ 8 సోమవారం ఈ వర్సిటీల్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5 వరకు సెలవులు పొడిగించగా, ఇవి జూన్ 6న తిరిగి ప్రారంభమవుతాయి. డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయి. విద్యావారోత్సవాలు, జనగణన విధుల్లో కొందరు డిగ్రీ అధ్యాపకులుండటం, ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సెలవులు పొడిగించారు.