Sukesh Chandrasekhar | స్పెషల్ టాస్క్ బ్యూరోహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ‘నకల్ మార్నె కే లియే అకల్ చాహియే (కాపీ కొట్టడానికైనా తెలివి ఉండాలి)’ అన్నది సామెత. అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. ఎంత పెద్ద మోసగాడైనా చిన్న ఆధారంతో దొరికిపోవటం చూస్తూనే ఉంటాం. అచ్చం అలాంటి తప్పులతోనే అడ్డంగా దొరికిపోయాడు తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న ఘరానా మోసగాడు సుకేశ్ చంద్రశేఖర్. పెద్ద పెద్ద వాళ్లపై అభాండాలు మోపటం, బ్లాక్ మెయిల్ చేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయంపై ఆధారాలు ఇస్తే అసెంబ్లీ సీటు ఇస్తామని మంత్రి కేటీఆర్, కవిత సన్నిహితులు ప్రలోభపెడుతున్నారని గవర్నర్ తమిళిసైకి లేఖ రాసినట్టు సుకేశ్ శుక్రవారం ప్రకటన విడుదల చేశాడు. అయితే, గవర్నర్ అని కాకుండా అతడు లెఫ్ట్నెంట్ గవర్నర్ అని సంభోదించటం గమనార్హం. తాను తీహార్ జైలులో ఉన్న ఢిల్లీకి లెఫ్ట్నెంట్ గవర్నర్ ఉన్నట్టే, తెలంగాణలో కూడా లెఫ్ట్నెంట్ గవర్నర్ ఉంటారని అనుకోవడం అతడి అజ్ఞానానికి నిదర్శనం. లెఫ్ట్నెంట్ గవర్నర్ ఉండేది కేంద్రపాలిత ప్రాంతాలకేనన్న ఇంగిత జ్ఞానం కూడా సుకేశ్కు లేదని తేలిపోయింది. అలాగే అసెంబ్లీ సీటు గురించి వ్యాఖ్యానించాడు. అయితే, ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీకి పోటి చేయాలంటే ప్రాథమికంగా అతడు ఆ రాష్ట్ర ఓటరు అయి ఉండాలి. తెలంగాణలో సుకేశ్ ఓటరు కాకుండా అసెంబ్లీ సీటు ఎలా ఇస్తారు? అతడికి ఆ మాత్రం కనీస జ్ఞానం లేదని లేఖ ద్వారా తేటతెల్లమైంది. అతడు విడుదల చేసిన లేఖలోనే ఇన్ని తప్పులు ఉంటే, చెప్పేదాంట్లో నిజమెంత?
17 ఏండ్ల వయసు నుంచే మోసాలు
సుకేశ్ చంద్రశేఖర్ బెంగళూర్ వాసి. అతడి తండ్రి చిన్నపాటి రబ్బర్ కాంట్రాక్టర్. మధ్య తరగతి కుటుంబానికి చెందిన సుకేశ్.. 17 ఏండ్ల వయసు నుంచే మోసాలు చేయటంలో రాటు తేలిపోయాడు. బెంగళూర్ మున్సిపాల్ కార్పొరేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని రూ.కోటిన్నర వసూలు చేసినట్టు తొలిసారి అతడి మోసాలు వెలుగుచూశాయి. ఒక్క బెంగళూర్లోనే అతడిపై 40 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. మకాం ముంబైకి మార్చుకొని అక్కడా మోసాలు చేశాడు. అక్కడ సుమారు 300 కేసులు నమోదైనట్టు ఒక ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. ఫార్మా కంపెనీ యజమాని శివిందర్ మోహన్సింగ్కు ఒక కేసులో బెయిల్ ఇప్పిస్తానని రూ.200 కోట్లు వసూలు వసూలు చేసి, మోసం చేసిన కేసులో సుకేశ్, అతడి భార్య అదితి లీనా తీహార్ జైలులోనే ఉన్నారు. తీహార్ జైలు కంటే ముందు రోహిణి జైలులో ఉన్నప్పుడు జైలు అధికారులకు లంచాలు ఇచ్చి అక్కడి నుంచే ఫోన్ ద్వారా దందా నడిపినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయటపెట్టింది. తనకు సహకరించినందుకు జైలు అధికారులకు కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలిపింది. దీంతో జైలు సూపరింటెండెంట్ పాటు ముగ్గురు అధికారులు కూడా ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత సుకేశ్ను తీహార్ జైలుకు మార్చారు.
కరుణానిధి, వైఎస్ కుమారుడినంటూ మోసాలు
అబద్ధాలు చెప్పి బురిడీ కొట్టించి మోసాలకు పాల్పడటం సుకేశ్కు కొత్తేమీకాదు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమారుడిగా, ఏపీ సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి మేనల్లుడిగా, ప్రధానమంత్రి కార్యాలయ అధికారిగా, హోంశాఖ ఉన్నతాధికారినని చెప్పుకొని పలువురిని మోసగించినట్టు చెన్నై, బెంగళూరులో కేసులు నమోదయ్యాయి. జయలలిత చనిపోయాక ఎన్నికల కమిషన్ నుంచి అన్నాడీఎంకే గుర్తు (రెండుకులు) ఇప్పిస్తానని తన నుంచి సుకేశ్ రూ.50 కోట్లు తీసుకొని మోసం చేశాడని టీటీవీ దినకరణ్ స్వయంగా కేసు పెట్టారు.
తీహార్ జైలులో అధికారులకు 12.5 కోట్లు
తీహార్ జైలు అధికారులకు సుకేశ్ రూ.12.5 కోట్లు లంచంగా ముట్టజెప్పినట్టు ఢిల్లీ క్రైమ్ బ్రాంచి పోలీసుల విచారణలో బయటపడింది. సుకేశ్ భార్య లీనాకు చెందిన 26 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ కోర్టు అనుమతించిందంటే కూడబెట్టిన డబ్బు ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయొచ్చు.
పెద్దవాళ్లను బ్లాక్ మెయిల్
బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసి వందల కోట్లు గుంజటమే సుకేశ్ పనిగా పెట్టుకున్నట్టు పలు కేసుల్లో బయటపడింది. అతడి బ్లాక్మెయిల్ దందాలు, సెటిల్మెంట్ల కోసం ప్రత్యేకంగా బ్యారక్, అందులో ఇంటర్నెట్, హై ఎండ్ స్మార్ట్ ఫోన్ సౌకర్యాలను జైలు అధికారులే కల్పించినట్టు విచారణలో తేలింది. పలువురు హీరోయిన్లతోకూ సుకేశ్కు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక ములాఖత్ తీసుకొని కొందరు హీరోయిన్లు అతడిని కలిసిన సందర్భాలున్నాయి.