మామిళ్లగూడెం, జూలై 10: ప్రజలు, రైతుల సూచనల మేరకే విధివిధానాలు రూపొందించి రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామని, అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే పథకం అమలుకు నిర్ణయం తీసుకుంటామని ఆ పథకం రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.
ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పంటల సాయం నిలుపుదల చేయాలని, రియల్ ఎస్టేట్, సాగుకు పనికిరాని భూములకు కూడా పంటల పెట్టుబడి సాయాన్ని బంద్ పెట్టాలని రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ పథకం అమలు కోసం రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్టు చెప్పారు.
ఇందులో భాగంగా బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులైన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రైతులకు పంటల పెట్టుబడి కోసం రైతుభరోసా పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామని, ఆ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిపారు.
రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతుభరోసా అమలుపై విధివిధానాల రూపకల్పన చేస్తామని చెప్పారు. క్యాబినెట్ సభ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నిజమైన రైతులకే రైతుభరోసా అందించేందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు చెప్పారు.
అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రైతుభరోసా అందిస్తామని వివరించారు. మరో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు, కౌలు రైతులు, వైద్యులు, న్యాయవాదులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలు, ఇతర వర్గాల ప్రజలు పాల్గొని సాగుభూమికే భరోసా అందజేసి చిన్న, సన్నకారు రైతులకు న్యాయం చేయాలని, ఆదాయపు పన్ను చెల్లింపుదారులను తొలగించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాలేని రైతులకు పంటల సాయం అందించాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, కౌలు రైతులకు బోనస్ అందించాలని అభిప్రాయాలు వెల్లడించారు.
ఈ సమాశంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్నాయక్, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు విజయనిర్మల, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.