యాదాద్రి, డిసెంబర్ 7: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో బుధవారం ఉదయం సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయం వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ అర్చకులు హవనం చేపట్టారు. స్వామి, అమ్మవార్లను గజవాహనంపై వెంచేపు చేసి కల్యాణోత్సవ సేవ నిర్వహించారు.
అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవం సాగింది. సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామివారిని గరుఢ వాహ నం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు. సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామివారి ఖజానాకు రూ.16,52,192 ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎన్ గీత తెలిపారు.