యాదాద్రి: యాదాద్రి (Yadadri ) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే ఆలయాభివృద్ధిలో బాగంగా చేపట్టిన కట్టడాలు పూర్తికాకపోవడంతో నారసింహ మహాయాగాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
కాగా, మూలవర్యుల దర్శనం మాత్రం గతంలో నిర్ణయించినట్లుగానే మార్చి 28న ప్రారంభమవుతుందని తెలిపారు. మహాకుంభ సంప్రోక్షణ చేపట్టిన తర్వాత ప్రధాన ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. ప్రస్తుతం నారసింహుడు కొలువై ఉన్న బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగిస్తామన్నారు. ఈ నెలాఖరులో ఆలయ రాజగోపురాలపై స్వర్ణ కలశాల స్థాపనచేపడతామని పేర్కొన్నారు.