హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్) ప్రక్రియ ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 3.39 కోట్ల మంది ఓటర్ల వివరాలను సరిచూసేందుకు ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. క్షేత్రస్థాయిలో ఓటర్ల గణన, మ్యాపింగ్ కోసం 35,985 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) రంగంలోకి దిగారు. ప్రతి మండలం, మున్సిపాలిటీలో తహసీల్దార్ స్థాయి అధికారి (అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) ఈ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఓటర్ల జాబితాలో నకిలీలను తొలగించేందుకు 2002 ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల రికార్డుల ఆధారంగా ప్రోజెనీ మ్యాపింగ్ (వంశవృక్ష నిర్ధారణ) ద్వారా ఓటర్లను ధ్రువీకరిస్తున్నట్టు తెలిసింది. రెండో విడతలో భాగంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్నది. మూడో విడతలో తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఈ ఏడాది ఏప్రిల్ -మే మధ్య ప్రకటించే అవకాశం ఉన్నది. గతంలో బీహార్లో జరిగిన ఎస్ఐఆర్ అనుభవాన్ని గుర్తుచేస్తూ, తెలంగాణలోనూ ఓట్ల తొలగింపు ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని ఓటర్లకు ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి.
సర్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సమయం పరిమితంగా ఉండటంతో రాష్ట్రంలో ముందస్తు సన్నాహక పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ సన్నాహక చర్యల్లో భాగంగా 2025 ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లను 2002 నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ చేపట్టారు. ఫీల్డ్ స్థాయి మ్యాపింగ్ కొనసాగుతున్నది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివాసాలను గుర్తించి ధ్రువీకరించేందుకు బీఎల్వోలు ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లోగా దీనిని పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నారు. ఎస్ఐఆర్ సమయంలో ప్రతి పోలింగ్ ప్రాంతాన్ని బీఎల్వోలు మూడు నుంచి నాలుగుసార్లు సందర్శిస్తారని చెప్తున్నారు. మొదటి సందర్శనలో ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారు. తదుపరి సందర్శనల్లో ముందుగా అందుబాటులో లేని కుటుంబాలను కవర్ చేస్తారు. సన్నాహక దశలో మ్యాపింగ్ కాకపోయిన ఓటర్లు కూడా ఎస్ఐఆర్ సమయంలో తమ వివరాలు సమర్పించుకొనే అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. స్పష్టమైన రికార్డులు ఉన్న వారు కేవలం ఫామ్ నింపితే సరిపోతుందని, అనుమానం ఉన్న పక్షంలో ఆ ధార్ వంటి గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. నివాసం మారిన వారు, మరణించినవారి వివరాలను తొలగించి, అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడమే ఈ కసరత్తు ప్రధాన ఉద్దేశమని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియపై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించేందుకు, వారి సహకారాన్ని కోరేందుకు గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- ఎస్ఐఆర్)ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని ప్రతి పోలింగ్స్టేషన్కు కనీసం ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను నియమించాలని రాజకీయ పార్టీలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్రెడ్డి కోరారు. బూత్స్థాయిలో సర్ ప్రక్రియకు బలమైన సమన్వయం కీలకమని చెప్పారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లోని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో గురువారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్ఏలను సాధ్యమైనంత వరకు ఆయా పోలింగ్స్టేషన్ల పరిధిలోని స్థానికుల నుంచే ఎంపిక చేయాలని, వారు బూత్ లెవల్ అధికారులతో (బీఎల్వో) సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు సీఈవో వాసం వెంకటేశ్వర్రెడ్డి, డిప్యూటీ సీఆర్వో హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు.