హైదరాబాద్ : తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీల ఆడిట్ను రాష్ట్ర ఆడిట్ శాఖ వంద శాతం ఆన్లైన్లో పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ శాఖ అమలు చేస్తున్న నూతన ఆన్లైన్ ఆడిట్ విధానంలో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 13శాతం మాత్రమే ఆడిట్ పూర్తి కాగా.. తెలంగాణలో మాత్రం వందశాతం పూర్తి చేసి దేశంలోని మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 2,56,561 జీపీలకు గాను 32,820 పంచాయతీల్లో ఆన్లైన్ ఆడిట్ పూర్తయింది.
ఆడిట్ను ప్రారంభించని 16 రాష్ట్రాలు
తెలంగాణలో 12,769 పంచాయతీలకుగాను అన్నింట్లో ఆడిట్లను పూర్తి చేసి తుది నివేదికలను ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ జాబితాలో 6,549 జీపీల్లో ఆడిట్ను పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడులో 5,560 , రాజస్థాన్లో 1,890, హిమాచల్ప్రదేశ్లో 645, ఒడిశాలో 2,657, కర్ణాటకలో 1,130, ఉత్తరప్రదేశ్లో 603 జీపీల్లో ఆడిట్ పూర్తి చేశారు. ఇంకా 16 రాష్ట్రాలు ఆడిట్ను ప్రారంభించనే లేదు. అలాగే దేశవ్యాప్తం 6,703 మండల పరిషత్లు ఉండగా.. తెలంగాణలో 540 మండలకు గాను 156 మండలాలు పూర్తి చేసుకుని మొదట నిలిచింది.
ఏపీలో 9 మండలాలు, ఒడిశాలోని 18 మండల పరిషత్ల ఆడిట్లు పూర్తయ్యింది. కేవలం తెలంగాణ, ఏపీ, ఒడిశా మాత్రమే మండల పరిషత్ల ఆడిట్ను ప్రారంభించింది. కేంద్రం ఆన్లైన్ ఆడిట్ను నిర్దేశించగా ఆర్థిక మంత్రి హరీశ్రావు పర్యవేక్షణలో, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు సూచన మేరకు ఆన్లైన్ ఆడిట్ను జూన్ నుంచి ప్రణాళిక ప్రకారం తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ను తయారు చేయించి అమలుకు శ్రీకారం చుట్టారు.
కేంద్రం చర్యలు తీసుకుంటున్నా..
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జీపీల ఆడిట్ను ఆన్లైన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా పలు రాష్ట్రాలు వాటిని పరిస్థితి నెలకొన్నది. తెలంగాణలో కరోనా వాక్సిన్ను ప్రజలకు వేయించే పనిలో ఉంటూనే వందశాతం ఆడిట్ను పూర్తి చేశారు. రాష్ట్ర ఆడిట్ ఉద్యోగులు ఐదు నెలలుగా పంచాయతీల ఆడిట్లో నిమగ్నమై పూర్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆడిట్ శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ నిరంతర పర్యవేక్షణతోనే వందశాతం ఆడిట్ ఆన్లైన్ పూర్తి చేసుకోగలిగామని, ఆడిటర్ల కృషితోనే సాధ్యమైందన్నారు.
ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణ ఆడిట్ విధానాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. మిగతా మండల పరిషత్లో ఆడిట్లను ఈ నెల పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ఆన్లైన్ ఆడిట్ విధానం ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఆడిట్లు చేసి నివేదికలను ఆన్లైన్లో పెట్టాలని ఆదేశించిన ఆయన.. ఈ సందర్భంగా ఆడిటర్లను అభినందించారు.