కీసర, జనవరి 31: విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నట్టు వై యాక్సిస్ కన్సల్టెన్సీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల్లోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ సంయుక్త ఆధ్వర్యంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్పై విద్యార్థులకు వైయాక్సిస్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఫైజల్ హుస్సేన్ మాట్లాడుతూ, ఇంజినీరింగ్ విద్యార్థులు చక్కటి ప్రణాళికతో ముందుకెళ్తే విదేశీ విద్య చాలా సులభమమని అన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన 90 శాతం మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనే కోరిక ఉంటుందని చెప్పారు. కానీ, సరైన గైడెన్స్ లేక చాలామంది విద్యార్థులు వెనుకబడిపోతున్నారని తెలిపారు. విదేశాలకు వెళ్లాలనుకొనే విద్యార్థులు తమ సంస్థను, నిర్వాహకులను సంప్రదిస్తే సూచనలు, సలహాలు ఇచ్చి పూర్తి అవగాహన కల్పిస్తామని వివరించారు. ప్రధానంగా ఇంజినీరింగ్ విద్యార్థులు ఆంగ్లభాషలో పట్టుసాధిస్తే విదేశీ చదువుల వేటలో సక్సెస్ కావడం ఖాయమని ఫైజల్ హుస్సేన్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రవీందర్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉదయ్కుమార్, తెలంగాణ పబ్లికేషన్స్ ఈవెంట్ మేనేజర్ గణేశ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రసన్నకుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జీ నవీన్రాం తదితరులు పాల్గొన్నారు.
పరిశోధనలకు విదేశాల్లో చక్కటి అవకాశాలు
విదేశాల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మరింత ప్రగతి సాధిస్తున్నారు. పరిశోధనల కోసం అక్కడ చక్కటి అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో మాస్టర్ డిగ్రీ సాధిస్తే ఉద్యోగ అవకాశాలు బాగా ఉంటాయి. విదేశాల్లో ఉన్నత విద్యకు చక్కని గైడెన్స్ తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను విదేశాల్లో చదివించుకోవడానికి వారికి కూడా అవగాహన ఎంతో అవసరం.
– ప్రిన్సిపాల్, డాక్టర్ ఉదయ్కుమార్
విద్యార్థులను ప్రోత్సహిస్తాం
విదేశాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు మా కళాశాల తరఫున పోత్సహిస్తాం. నేడు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రంగాలు చాలా అభివృద్ధి చెందాయి. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ విద్యార్థులు అన్ని రంగాల్లో చక్కగా రాణిస్తున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.
– కళాశాల చైర్మన్, రవీందర్రెడ్డి