హైదరాబాద్, మార్చి 7 : పొద్దున లేచి తట్ట, పార పట్టుకొని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి ఒళ్లు హూనమయ్యేలా కష్టపడి రాత్రికి గానీ ఇంటికి చేరుకోలేని దయనీయ పరిస్థితి భవన నిర్మాణ కార్మికులది. బైక్ కొనాలనుకొన్నా వారి ఆర్థిక స్థోమత అంతంతమాత్రమే. వారి దుస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీపై మోటర్ సైకిళ్లు అందించే సరికొత్త పథకాన్ని ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆలోచన చేయని పథకం ఇది. మొదటి విడతగా లక్ష మందికి సబ్సిడీపై మోటర్ సైకిళ్లు అందజేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం తయారు చేసే పనిలో ఉన్నదని మంత్రి హరీశ్రావు బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.