హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎంపీ బీబీ పాటిల్తో కలిసి హన్స్రాజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఓబీసీ జాబితాలో లేక పోవటం వల్ల 40 బీసీ కులాలకు చెందిన పేద విద్యార్థులు జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు కోల్పోతున్నారని చెప్పారు. నవోదయ నుంచి ఐఐటీ, ఎంబీబీఎస్ వరకు అనేక విద్యావకాశాలు అందడం లేదన్నారు. క్లరికల్ నుంచి సివిల్ సర్వీస్ వరకు ఉద్యోగాలూ నష్టపోతున్నారని తెలిపారు. 2021 డిసెంబర్లో జాతీయ బీసీ కమిషన్ కులాలపై విచారణ చేపట్టినట్లు గుర్తు చేశారు. రాష్ట్ర బీసీ కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ఆయా కులాల స్థితిగతులను తెలుసుకోని నివేదిక ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో బీసీ కులాలుగా గుర్తింపు ఉన్న అన్ని కులాలను పరిశీలించి వాటన్నింటిని పరిగిణణలోకి తీసుకొని రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారం అహీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దేశంలోని అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, అగ్రకులాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్ను సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఓబీసీలకు రిజర్వేషన్లు, రిజర్వేషన్ రోస్టర్ అమలు గురించి చెప్పారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్స్’ కార్యకలాపాలను వివరించారు.