చదువుల భారం విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నది. ఒత్తిడితో బంగారు భవిష్యత్తు చిత్తవుతున్నది. తల్లిదండ్రులు వారి ఆశయాలు, ఆలోచనలను పిల్లలపై రుద్దుతుండటంతో దేశంలో అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు, నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు సూసైడ్ క్యాంపస్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటకుండా ఆదిలోనే ఒత్తిడిని జయించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల మనసెరిగి నడుచుకోవాలని చెప్తున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): యూకేలో ఎంబీబీఎస్లో చేరాలనుకొనే విద్యార్థులు ఆ కోర్సులో చేరడానికి ముందే దవాఖానల్లో రెండు వారాలపాటు పనిచేస్తారు. దీనివల్ల ఈ వృత్తి తనకు నప్పుతుందో లేదో.. తాను ఈ వృత్తికి సరిపోతానో లేదోనని ముందే నిర్ధారించుకొంటాడు. తర్వాత తనకు నచ్చితేనే ఆ కోర్సులో చేరతాడు. ఇలాంటి విధానం మన దగ్గర లేదు. కేవలం గొర్రెదాటుడు వ్యవహారం.
చేరితే ఐఐటీల్లోనే చేరాలి. కార్పొరేట్ కొలువు కొట్టాలన్న బలమైన కోరిక. సుందర్పిచాయ్, సత్యనాదెళ్ల ఖరగ్ఫూర్ ఐఐటీ, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి సంస్థల నుంచి అత్యున్నత స్థానాలకు ఎదిగారు. మనం కూడా ఎదగాలన్న బలీయమైన ఆకాంక్ష. ఈ కోరిక నెరవేరకుంటే ఇక జీవితం వృథా అన్న ఆలోచన.
ఏటా జాతీయంగా 50 లక్షల మంది పట్టా లు పుచ్చుకొని డిగ్రీలతో బయటికొస్తున్నారు. వీరిలో కేవలం 24 లక్షల మందికే ఉద్యోగాలు లభిస్తున్నాయి. సగంకంటే తక్కువమందికే ఆర్థిక భరోసా దొరుకుతున్నది. మిగతా వారంతా జీవనపోరాటంలో ఓడిపోతున్నారు.
ఇలాంటి పరిస్థితులే విద్యార్థులను ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఇష్టంలేని, భరోసా ఇవ్వని చదువులు.. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చేరాలన్న ఆకాంక్ష. ఉద్యోగాలు దొరకని పరిస్థితితో ఒత్తికి గురై జీవితాలను బలితీసుకొంటున్నాయి. అయితే, వాస్తవానికి ఇవే జీవితం కాదని, జీవన పోరాటంలో మనం నిలదొక్కుకొనేందుకు నావకు చుక్కానిలా మాత్రమే చదువు ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఎదురయ్యే ఒత్తిడిని జయిస్తే భవిష్యత్తు అంతా బంగారుమయమేనని అంటున్నారు. తీపి, చేదులను రుచిచూసినట్టే జీవితంలో అన్ని పరిస్థితులను తట్టుకొని నిలబడాలని సూచిస్తున్నారు. ఒత్తిళ్ల పొత్తిళ్లను ఓడిస్తేనే బంగారు భవితకు బాటలేసుకోగలమని చెప్తున్నారు. మనల్ని మనం సంభాలించుకోవడం.. తల్లిదండ్రుల సహకారాన్ని పొందడం అత్యవసరమని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఏది జరిగినా, ఏం చోటుచేసుకున్నా అతిగా ఆలోచించే తత్వమే అనర్థాలకు దారితీస్తున్నదని సైకాలజిస్ట్లు చెప్తున్నారు. మానసిక అపరిపక్వత కారణంగా ప్రతిదాన్ని భూతద్ధంలో పెట్టి చూడటం వల్ల సమస్యలు చాలా పెద్దవిగా భావించి తప్పుడు నిర్ణయాలు తీసుకొంటున్నారని అంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకొని ఎదురీదితేనే సమస్యలన్నీ పటాపంచలవుతాయని సూచిస్తున్నారు. మానసికశాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆత్మవిశ్వాసం కలిగిన వారు దృఢమైన అభిప్రాయానికి వస్తారు. ఆత్మవిశ్వాసం లోపించిన వారు ప్రతిదానికి ఒత్తిడికి గురవుతారు. తీవ్ర ఆలోచనలు, పదే పదే అదే విషయాల పట్ల ఆలోచించి మనస్థాపం చెందుతారు. ఈ వ్యవహారమే కఠిన నిర్ణయాలు తీసుకొని.. ఆత్మహత్యలకు పాల్పడేందుకు పురిగొల్పుతున్నదని చెప్తున్నారు. ఆ సమయంలో ఒత్తిడిని తట్టుకొని నిల్చొంటే ఈ సమస్యనుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఈ సమయంలో లెక్చరర్లు, తోటి విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారం తీసుకోవాలని సూచిస్తున్నారు. యోగా, ధ్యానం, క్రీడల్లో మునిగితేలితే ఆత్మహత్య ఆలోచనలనుంచి బయటపడొచ్చని చెప్తున్నారు.
తల్లిదండ్రుల శృతిమించిన ప్రవర్తన కారణంగానే విద్యార్థులు తీసుకోకూడని నిర్ణయాలు తీసుకొంటున్నారని పలు సర్వేల్లో తేలింది. వారి ప్రవర్తన కారణంగానే పిల్లలు మానసిక క్షోభకు గురవుతున్నారు. పిల్లల పెంపకంలో జాగ్రత్తలు పాటించకపోవడం, పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు సైతం తల్లిదండ్రులను కంగారుపెడుతున్నాయి. పిల్లలు చెడిపోతున్నారని, తప్పుదారి పడుతున్నారన్న ఆందోళన.. పిల్లలను గాడినపెట్టాలనే ఆలోచన వారు శృతిమించి ప్రవర్తించేందుకు దారితీస్తున్నట్టు మానసిక నిపుణులు చెప్తున్నారు. తల్లిదండ్రులు తాము ప్రశాంతంగా ఉండి సానుకూలవైఖరిని పెంపొందించడం, సమయస్ఫూర్తి ప్రదర్శించడం.. పిల్లలు చెప్పింది ఆలకించడం చేస్తే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సూచిస్తున్నారు. ఆత్మహత్యలకు పాల్పడటం అనేది జబ్బుకాదని, అంతకంటే మానసిక సమస్య అసలు కాదని అంటున్నారు. పిల్లల పెంపకం, వారి ఎమోషన్స్ను నియంత్రించడంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ సమస్యను నిర్మూలించడం కన్నా అధిగమించడానికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో ఇంటర్ విద్యలో ఆత్మహత్య ల నివారణకు సర్కారు పలు చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి కార్పొరేట్ కాలేజీల్లో ఆత్మహత్యలను సీరియస్గా తీసుకొన్నది. ఒత్తిడిని తగ్గించడం, కాలేజీలను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించి, అమలు చేస్తున్నది. కాలేజీల్లో ఒత్తిడిని తగ్గించేందుకు రోజుకొక పీరియడ్ను కేటాయించా రు. ఉదయం వేళల్లో యోగా, ఆటలు, క్రీడలు, మెడిటేషన్ను తప్పనిసరి చేశారు. స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించాలని ఆదేశాలిచ్చారు. ఇంటర్బోర్డు నిపుణులైన సైకాలజిస్ట్లను అం దుబాటులో ఉంచింది. వీరికి ఫోన్ చేస్తే ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చే వెసులుటుబాటును కల్పించింది. ‘టెలిమానస్’ సేవలను వినియోగించుకొనే అవకాశం కల్పించింది. టోల్ఫ్రీ నెంబర్లకు కాల్చేస్తే స్వాంతన లభించే ఏర్పాట్లు చేశారు. రెసిడెన్షియల్ కాలేజీల్లోని విద్యార్థులకు 8 గంటల నిద్రను తప్పనిసరిచేశారు.
విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించేందుకు కాలేజీలకు మార్గదర్శకాలు జారీచేశాం. ఆయా మార్గదర్శకాలను కాలేజీలు పాటించాల్సిందే. నిరుడు ఒక విద్యార్థి కాలేజీలో ఆత్మహత్య చేసుకోగా, ఆ కాలేజీలో ఈ ఏడాది సెకండియర్ అడ్మిషన్లు రద్దుచేశాం. ఇటీవల మరో రెండు కాలేజీల్లో ఆత్మహత్యలు చోటుచేసుకోగా, ఆయా కాలేజీలకు నోటీసులిచ్చాం. అయినా కాలేజీలు తీరు మార్చుకోకుండా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తే ఇంకా కఠినచర్యలు తీసుకుంటాం. విద్యార్థులకు స్వాంతన చేకూర్చేందుకు ఉచిత కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేశాం. టెలిమానస్ సేవలను వినియోగించుకొనే అవకాశం కల్పించాం.
– జయప్రదబాయి, ఆర్జేడీ, ఇంటర్విద్య
నేను ఇంటర్ విద్యార్థులకు మూడేండ్లుగా కౌన్సెలింగ్ ఇస్తున్నా. పరీక్షలు ఉన్నా, లేకపోయినా విద్యార్థులు ఒత్తికి గురవుతున్నారు. నవంబర్ నుంచి కౌన్సెలింగ్ కాల్స్ అధికమవుతాయి. ఇటీవలే 7-8 మంది విద్యార్థులు ఇంటి నుంచి పారిపోయిన ఘటనలు నా దృష్టికి వచ్చాయి. పిల్లల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి. బిజీ లైఫ్, తీరిక సమయం దొరక్క చాలా మంది పిల్లలతో గడపడం లేదు. ప్రణాళికాబద్ధంగా పిల్లలతో గడిపేందుకు ప్రయత్నించాలి. రోజుకు కనీసం గంట సయయం వారి కోసం కేటాయించి, వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలి. సమస్యలు ఆత్మహత్య చేసుకొనేంత పెద్దవేం కాదు.
– జవహర్లాల్ నెహ్రూ, సైకాలజిస్ట్