హైదరాబాద్, ఫిబ్రవరి 28 : కళాశాలల విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలు గంజాయి విక్రయాలకు తెరతీస్తున్నాయి. ఇందుకు హైటెక్ పద్ధతులను అనుసరిస్తున్నాయి. యువతకు మత్తెక్కించేందుకు అత్యంత నాణ్యమైన హై గ్రేడ్ గంజాయిని విదేశాల నుంచి తెప్పిస్తున్నాయి. ఇటీవల ఎక్సైజ్ అధికారుల సోదాల్లో హై గ్రేడ్ గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగిస్తున్నది. వారం గడవక ముందే మరోమారు పెద్దమొత్తంలో హై గ్రేడ్ గంజాయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) హైదరాబాద్ యూనిట్ అధికారులకు చిక్కడం గమనార్హం. సాధారణ గంజాయితో పోలిస్తే తక్కువ వాసన, పది రెట్లకుపైగా మత్తు కలిగించడం దీని ప్రత్యేకత. దీని ధర కిలో రూ.20 లక్షల వరకు ఉంటుంది. డ్రగ్ దందా అంతా డార్క్నెట్ కేంద్రంగా నడుస్తున్నది. అత్యంత ఖరీదైన మత్తు పదార్థాల కొనుగోళ్ల వ్యవహారాలు సైతం డార్క్నెట్ ద్వారానే జరుగుతున్నట్టు అధికారుల దర్యాప్తులో తేలింది. ఇక్కడ ఎవరు కొంటున్నారు.. ఎవరు అమ్ముతున్నారు.. ఎక్కడికి పార్సిల్ బుక్ అయ్యిందన్న విషయాలు కనిపెట్టడం కష్టసాధ్యం. వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. తద్వారా స్మగ్లర్ల లింకు దొరకడం కష్టమవుతున్నది. బిట్కాయిన్ల ద్వారా లావాదేవీలు జరుపుతుండటంతో నిందితుల ఆచూకీ చిక్కడం లేదు. ఇటీవల ఎన్సీబీకి చిక్కిన 1.42 కిలోల హై గ్రేడ్ గంజాయిని సైతం డార్క్నెట్ ద్వారానే కొన్నట్టు నిందితులు లక్షయ్జైన్, అమరేందర్ అంగీకరించారు. కొరియర్ ద్వారా సరుకు చేతులు మారుతుండటంతో పలు కొరియర్ సంస్థలకు వస్తున్న అనుమానాస్పద వస్తువులపైనా అధికారులు నిఘా పెడుతున్నారు.
ఎంజాయ్ చేద్దామంటూ ప్రియురాలికి లేఖ
మెహదీపట్నంలో ఫిబ్రవరి 18న డ్రగ్పెడ్లర్ షోహిబ్ఖాన్ ఇంట్లో ఎక్సైజ్ అధికారులు జరిపిన సోదాల్లో హైగ్రేడ్ గంజాయి లభించింది. తన ప్రేయసికి అతడు రాసిన ప్రేమలేఖ సైతం చిక్కింది. ‘మనం ఇద్దరమే ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ సరుకు ఎంజాయ్ చేద్దాం.. చాలా గమ్మత్తుగా ఉంటుంది..’ అంటూ లేఖలో రాశాడు. ఇలా డ్రగ్స్ను అమ్మాయిలకు అలవాటు చేసి క్రమంగా వాళ్లను కూడా పెడ్లర్లుగా మార్చుతున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే నగర శివార్లలోని కాలేజీల్లో కొందరు విద్యార్థులు వాట్సాప్ గ్రూప్లు, కోడ్ పదాల ద్వారా మత్తుపదార్థాలు వినియోగిస్తున్నట్టు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.