యాదగిరి గుట్ట, భువనగిరి : విద్యార్థులు ప్రయోగాలు చేసే దిశగా ఎదగాలని, కొత్త ఆవిష్కరణలు రూపొందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్(Smita Sabharwal) విద్యార్థులకు ఉద్బోధించారు. మంగళవారం ఆమె శాసన మండలి సభ్యులు(MLC) ఎలిమినేటి కృష్ణారెడ్డి తో కలిసి భువనగిరి మండలం అనంతారం గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోసియో రెస్పాన్సిబిలిటీ) క్రింద తెలంగాణలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్టెమ్ ల్యాబ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ల్యాబ్ లోని పరికరాలను, విద్యార్థుల నూతన ఆవిష్కరణలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జాతీయ సైన్స్ డే (National Science Day) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చదువుపైనే దృష్టిని సారించాలన్నారు. సైన్స్ లో ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు రూపొందించే దిశగా ఎదగాలని, ల్యాబ్లో అద్భుత పరికరాలు ఉన్నాయని,ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్ రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మల, జడ్పీటీసీ బీరు మల్లయ్య, డీఈవో నారాయణరెడ్డి, సర్పంచ్ మల్లిఖార్జున్, ఎంపీటీసవెంకటేశం, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ మాధవి తదితరులు పాల్గొన్నారు.