చేవెళ్ల : విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణిస్తే సమాజంలో గుర్తింపు వస్తుందని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రీడామైదానాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు.
విద్యార్థులు క్రీడలో రాణించాలని సూచించారు. ఆటలో గెలుపోటములు సహజమని , విద్యార్థులు ఉత్సాహంగా క్రీడాపోటీలలో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో క్రీడాప్రాంగణాలను నిర్మిస్తుందన్నారు. వైద్యం, విద్యకు సమాజంలో మంచి గుర్తింపు ఉందన్నారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల కార్యదర్శి సంతోష్ రెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జోయరాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వర్ రావు, చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట రంగారెడ్డి, వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.