కామారెడ్డి, డిసెంబర్ 30: విద్యార్థుల కోసం బస్సులు నడపాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట శనివారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకువచ్చి బస్సుల సంఖ్యను తగ్గించిందని విమర్శించారు.
సమయానుకూలంగా బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు సకాలంలో పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం కామారెడ్డిలో జరిగిన ఓ పరీక్షకు 20 మంది విద్యార్థులు చేరుకోలేకపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలలు, కళాశాలల వేళలకు అనుకూలంగా బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. డిపో మేనేజర్ ఇందిర అక్కడికి చేరుకొని విద్యార్థులను సముదాయించారు. కాగా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోనూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేశారు.