Harish Rao | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఈ బువ్వ మాకొద్దు, ఇకడ మేం ఉండలేం.. మమ్మల్ని తీసుకెళ్లండి’ అని విద్యార్థులు తమ తల్లిదండ్రులను వేడుకొనే దుస్థితి ఎందుకు వచ్చిందని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితిని చూస్తుంటే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతున్నది. ఓవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో ఈ బువ్వ మేము తినలేం, మమ్మల్ని తీసుకెళ్లండి అని వేడుకుంటున్న విద్యార్థులు. మరోవైపు అనంతపేట కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పది మంది విద్యార్థులు దవాఖాన పాలైన దుస్థితి.
విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారు. ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటిబాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా?’ అని నిలదీశారు. ‘కన్నబిడ్డల ఆవేదన చూడలేక తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నరు. ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? రేవంత్రెడ్డీ?.. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నువ్వే ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నవు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి’ అని హరీశ్ డిమాండ్ చేశారు.