Hyderabad | హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో డిగ్రీ చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గతంలో పీజీ, వృత్తివిద్యా కోర్సుల అభ్యసనకు మాత్రమే జిల్లాల నుంచి విద్యార్థులు హైదరాబాద్కు వచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. తాజాగా డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్లో విద్యావకాశాలు, ఉద్యోగాలు లభించే వాతావరణం కూడా విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నది.
ఉన్నత చదువులు చదివిన తర్వాత ఉద్యోగాల కోసం తిరిగి హైదరాబాద్కే రావాల్సి ఉండటంతో ముందుగానే ఇక్కడి వాతావరణానికి అలవాటుపడటం మంచిదన్న భావన కూడా విద్యార్థుల్లో కనిపిస్తున్నది. అందుకే, ఇంటర్ పూర్తికాగానే చలో హైదరాబాద్ అంటూ పయనమవుతున్నారు. అయి తే, ఇది ప్రైవేట్ కాలేజీల్లో అనుకొంటే పొరపాటు పడ్డట్టే. అత్యధిక విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోనే చేరుతుండటం విశేషం. మరీ ముఖ్యంగా ప్రతిభావంతులైన వారే ఈ జాబితాలో ఉన్నారు.
డిగ్రీలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికే నగరంలోని కాలేజీల్లో సీట్లు దొరుకుతున్నాయి. 85 శాతం మార్కులొచ్చిన వారికీ సీట్లు దొరకని పరిస్థితి ఉంది. 2022-23లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 62 వేల మందికిపైగా విద్యార్థులు చేరగా, గురుకులాల్లో మరో 8,509, ఆఫ్లైన్ కాలేజీల్లో మరో 18,421 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. అంటే మొత్తం మీద దోస్త్లో 2 లక్షల మంది విద్యార్థులు చేరితే, 90 వేలకు పైగా విద్యార్థులు గ్రేటర్లోనే చదువుతుండటం విశేషం.
గతంలో డిగ్రీలో చేరేందుకు కాలేజీల వారిగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. మొదటి లిస్టు, రెండో లిస్టు, మూడో లిస్ట్, స్పాట్ ఇలా ప్రతిసారి విద్యార్థి వ్యయప్రయాసలకోర్చి కాలేజీల వరకు వెళ్లాల్సి ఉండేది. ప్రతిసారి డబ్బులు వృథాచేసుకోవాల్సి వచ్చేది. పైగా తమకు సమీపంలోని కాలేజీల్లో మాత్రమే దరఖాస్తు చేసే వీలుండేది. కానీ ఈ తిప్పలు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) తీర్చింది. రాష్ట్రంలోని అన్ని కాలేజీలతో విద్యార్థులకు దోస్తీని కుదిర్చింది. ఏ ప్రాంతం విద్యార్థియైనా రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో సీట్లు పొందే అవకాశాన్నిచ్చింది. దీంతో విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. నిరుడు డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సిటీ కాలేజీలు, కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విద్యార్థులే కాకుండా మారుమూల జిల్లాలైన కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్లో గణనీయంగా చదువుతుండటం విశేషం.
కోఠి మహిళా కాలేజీ (తెలంగాణ మహిళా వర్సిటీలో) 1,520 మంది విద్యార్థులు చేరగా, అందులో ఆదిలాబాద్ నుంచి 24 మంది విద్యార్థులు, భద్రాద్రికొత్తగూడెం 27, హనుమకొండ 7, హైదరాబాద్ 199, జగిత్యాల 61, జనగామ 17, జయశంకర్ భూపాపల్లి 9, జోగులాంబ గద్వాల 49, కామారెడ్డి 37, కరీంనగర్ 20, ఖమ్మం 15, కుమ్రం భీం ఆసిఫాబాద్ 19, మహబూబాబాద్ 24, మహబూబ్నగర్ 38, మంచిర్యాల 40, మెదక్ 20, మేడ్చల్ -మల్కాజిగిరి 68, ములుగు 7, నాగర్కర్నూల్ 50, నల్లగొండ 114, నారాయణపేట 23, నిర్మల్ 89, నిజామాబాద్ 54, పెద్దపల్లి 29, రాజన్న సిరిసిల్ల 24, రంగారెడ్డి 237, సంగారెడ్డి 40, సిద్దిపేట 19, సూర్యాపేట 32, వికారాబాద్ 23, వనపర్తి 36, వరంగల్ 10, యాదాద్రి భువనగిరి నుంచి 59 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
నిజాం కాలేజీలో మంది 915 మంది విద్యార్థు లు చేరగా, అందులో ఆదిలాబాద్ 12, భదాద్రికొత్తగూడెం 9, హనుమకొండ 4, హైదరాబాద్ 120, జగిత్యాల 25, జనగాం 14, జయశంకర్ భూపాపల్లి 12, జోగులాంబ గద్వాల 19, కా మారెడ్డి 17, కరీంనగర్ 20, ఖమ్మం 9, కుమ్రం భీం ఆసిఫాబాద్ 21, మహబూబాబాద్ 19, మహబూబ్నగర్ 28, మంచిర్యాల 18, మెదక్ 11, మేడ్చల్ -మల్కాజిగిరి 63, ములుగు 5, నాగర్కర్నూల్ 38, నల్లగొండ 65, నారాయణపేట 25, నిర్మల్ 20, నిజామాబాద్ 33, పెద్దపల్లి 24, రాజన్న సిరిసిల్ల 4, రంగారెడ్డి 128, సంగారెడ్డి 28, సిద్దిపేట 19, సూర్యాపేట 18, వికారాబాద్ 30, వనపర్తి 25, వరంగల్ 13, యాదాద్రి నుంచి 19 మంది ఉన్నారు.
బేగంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మొత్తం 1,294 మంది విద్యార్థులు చేరగా.. అందులో ఆదిలాబాద్ 03, భదాద్రికొత్తగూడెం 16, హనుమకొండ 03, హైదరాబాద్ 352, జగిత్యాల 33, జనగాం 19, జయశంకర్ భూపాపల్లి 1, జోగులాంబ గద్వాల 19, కామారెడ్డి 14, కరీంనగర్ 10, ఖమ్మం 8, కుమ్రం భీం ఆసిఫాబాద్ 7, మహబూబాబాద్ 10, మహబూబ్నగర్ 14, మంచిర్యాల 5, మెదక్ 18, మేడ్చల్ -మల్కాజిగిరి 350, ములుగు 3, నాగర్కర్నూల్ 23, నల్గొండ 34, నారాయణపేట 14, నిర్మల్ 49, నిజామాబాద్ 37, పెద్దపల్లి 04, రాజన్న సిరిసిల్ల 10, రంగారెడ్డి 65, సంగారెడ్డి 59, సిద్దిపేట 20, సూర్యాపేట 20, వికారాబాద్ 23, వనపర్తి 18, వరంగల్ 05, యాదాద్రి భువనగిరి నుంచి 28 మంది విద్యార్థులు ఉన్నారు.