హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. ఓ వైపు సాధారణ ప్రజలు టీవీలకు అతుక్కుపోతే.. మరో వైపు ఉద్యోగ అభ్యర్థులు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు అతుక్కుపోయారు. స్టడీ సెంటర్లు, లైబ్రరీల్లో విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు తమ చదువులపై దృష్టి కేంద్రీకరిస్తూనే.. కేసీఆర్ ప్రసంగాన్ని పూర్తిగా విన్నారు. గంట పాటు కొనసాగిన కేసీఆర్ ప్రసంగాన్ని తమ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ల్లో ఉద్యోగ అభ్యర్థులు వీక్షించారు.
80,039 ఉద్యోగాల నియామకానికి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించగా, విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. శాఖలు, జిల్లాల వారీగా ఖాళీలపై దృష్టి సారించారు. హోం, విద్య, హెల్త్ శాఖల్లో భారీగా ఖాళీలు ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్నేండ్ల నుంచి పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు పండుగ చేసుకుంటున్నారు. అంతే కాదు ఈ నియామకాలన్నీ నేరుగా చేపడుతామని కేసీఆర్ ప్రకటించడంతో మరింత సంతోషంతో విద్యార్థులు గంతేశారు.