హైదరాబాద్, మార్చి18 (నమస్తే తెలంగాణ): హాస్టల్ విద్యార్థుల 10 నెలల మెస్చార్జీల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి సోమవారం కృష్ణయ్య బహిరంగ లేఖ రాశారు.
10 నెలలుగా మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లకు సరఫరా చేసే నిత్యావసరాలను వ్యాపారులు నిలిపివేశారని, దీంతో హాస్టళ్లను మూసివేసే దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్రంలోని 700 బీసీ, 1500 ఎస్సీ, ఎస్టీ హస్టళ్ల పెండింగ్ మెస్చార్జీల బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని కోరారు.